జగన్ కు విరుగుడు: స్థానిక ఎన్నికలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్లాన్ ఇదీ...

Published : Oct 23, 2020, 08:55 AM ISTUpdated : Oct 23, 2020, 09:08 AM IST
జగన్ కు విరుగుడు: స్థానిక ఎన్నికలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్లాన్ ఇదీ...

సారాంశం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనకు భిన్నంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే ఎత్తుగడలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు నిమ్మగడ్డ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ రంగంలోకి దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుముఖంగా లేనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే వ్యూహరచనలో రమేష్ కుమార్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా గతంలో రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. ఎన్నికలను వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయనపై తీవ్రంగా మండిపడ్డారు. ఎస్ఈసీగా రమేష్ కుమార్ ను తప్పించేందుకు జగన్ ప్రభుత్వం ఆర్డినెన్స్ లు కూడా జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాలతో ఆయన తిరిగి ఎస్ఈసీగా నియమితులయ్యారు. 

వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపిస్తూ ఆయన హైకోర్టును కూడా ఆదేశించారు. ఎస్ఈసీకి సహకరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తగిన ప్రాతిపదికను ఏర్పాటు చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఆయన తీసుకుంటారని సమాచారం. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలతో ఓ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

స్థానిక సంస్థల నిర్వహణపై చర్చించేందుకు ఈ నెల 28వ తేదీన రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు రమేష్ కుమార్ గురువారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఈ సమావేశం ఉంటుందని చెప్పారు. రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరించిన తర్వాత తదుపరి కార్యాచరణపై ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు. 

గతంలో పలు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అధికార వైసీపీ నేతలు ప్రత్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేిసి తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రమేష్ కుమార్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్