రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ను సవరిస్తూ ఆర్-5 జోన్ ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ను సవరిస్తూ ఆర్-5 జోన్ ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇందుకు సంబంధించి ఎల్లుండి హైకోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. ఇక, రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ పేరిట బయట వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని హైకోర్టులో రైతులు సవాలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతుంది.
రాజధానిలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే నిమిత్తం 1,134ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించేలా సీఆర్డీఏను ఆదేశిస్తూ ప్రభుత్వం జీవో 45ను విడుదల చేసింది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఏపీ టిడ్కో గృహాలు ఆర్థికంగా పేద వర్గాలకు ఉద్దేశించినవని.. రాజధాని నగరంలో ఈ ఇళ్ల నిర్మాణానికి నిర్దిష్ట నిబంధనలు ఉన్నప్పటికీ ఆర్ 5 జోన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ను సవరించాలని ప్రతిపాదించిందని పిటిషనర్లు పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తైన లబ్దిదారులకు అందజేయకుండా ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వానికి తొందర ఎందుకని పిటిషనర్లు ప్రశ్నిస్తున్నారు.
అయితే ఏపీటీడ్కో ఇళ్లు, లబ్ధిదారుల వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు సీఆర్డీయే అధికారులు ఆర్-5 జోన్ లో భూములు చదును చేస్తున్నారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు.