కోర్ట్ ధిక్కరణ నేరం.. టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఊరట, సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే

By Siva KodatiFirst Published Dec 16, 2022, 2:31 PM IST
Highlights

కోర్ట్ ధిక్కరణ కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఊరట లభించింది. ఆయనకు నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. 

కోర్ట్ ధిక్కరణ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డిపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ ఆదేశాలను అమలు చేయనందుకు గాను టీటీడీ ఈవోకు నెల రోజుల జైలు శిక్ష, రూ 2 వేల జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఈవో డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించడంతో సింగిల్ జడ్జి తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది. 

2011లో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ లో  ప్రోగ్రాం అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ను అదే ఏడాది సవాల్ చేస్తూ కొమ్ము బాబు, బి. సేవ్లా నాయక్, ఆర్ స్వామి నాయక్ హైకోర్టును ఆశ్రయించారు. వీరంతా గత 17 ఏళ్లుగా ప్రోగ్రామ్ అసిస్టెంట్లుగా టీటీడీలో పనిచేస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆదేశించాలని కోరారు. ఈ ఏడాది ఏప్రిల్ 13న ఈ వ్యాజ్యం మీద న్యాయస్థానం విచారణ జరిపింది. టిటిడి జారీ చేసిన నోటిఫికేషన్ ను కొట్టివేసింది. పిటిషనర్ల సర్వీసును రెగ్యులర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ALso REad:కోర్టు ధిక్కరణ కింద టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష..

అయితే దీని మీద టిటిడి ఏలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో  హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదని పేర్కొంటూ ఆ ముగ్గురు ఈ ఏడాది జూన్లో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. పిటిషనర్ల తరఫున కేకే దుర్గాప్రసాద్ వాదించారు. టీటీడీ ఈవో దీని మీద కౌంటర్ దాఖలు చేశారు ఈ ఏడాది ఏప్రిల్ 13న ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను జూన్ 20న అప్పీలు చేశామని అది పెండింగ్లో ఉందని తెలిపారు. అంతేకాదు, కోర్టు ఆదేశాల అమలుకు టైం పీరియడ్ విధించలేదని తెలిపారు. సీనియర్ న్యాయవాది ఎస్ ఎస్ ప్రసాద్ ఈవో తదితరుల తరఫున వాదించారు. వారు పెట్టిన అప్పీలు పెండింగ్లో ఉందని అది ఆ సమయంలో కోర్టు ధిక్కరణ కేసు సహజంగా విచారణ చేయకూడదని అన్నారు. 

ఆ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. టీటీడీ ఈవో వేసిన కౌంటర్ పరిశీలించామని.. కోర్టు ఆదేశాల అమలు విషయంలో ప్రతివాదుల వైఖరి ఏమిటో దీని వల్ల స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. గరిష్టంగా రెండు నెలల్లో కోర్టు ఆదేశాలను అమలు చేయాలని అని తెలిపారు. అది తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే ఉత్తర్వులను ఉల్లంఘించారని తెలిపారు. కోర్టు ధిక్కరణ కింద టీటీడీ ఈవో ధర్మారెడ్డికి  జైలు శిక్షకు అర్హులే అని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల రోజుల పాటు సాధారణ జైలు శిక్ష, రూ.2వేలుజరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
 

click me!