అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. జైలులో లొంగిపోయిన ఎమ్మెల్సీ

By Siva KodatiFirst Published Sep 9, 2022, 2:57 PM IST
Highlights

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. దీంతో శుక్రవారం ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో లొంగిపోయారు. 

మాజీ డ్రైవర్‌ను హత్య చేసిన కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌‌పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. కేసును బుధవారానికి వాయిదా వేసింది. దీంతో ఆయన శుక్రవారం రాజమహేంద్ర వరం కోర్టులో లొంగిపోయారు. 

ఇటీవల తన తల్లి కన్నుమూయడంతో .. ఆమె అంత్యక్రియల్లో పాలుపంచుకునేందుకు గాను న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తొలుత మూడు రోజులు మాత్రమే బెయిల్ మంజూరు చేయగా.. అనంతబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం ఆయనకు మరో 11 రోజులు బెయిల్ పొడిగించింది. ఈ క్రమంలోనే అనంతబాబు రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. 

ALso REad:వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ రిలీఫ్.. బెయిల్ పొడిగించిన హైకోర్ట్

ఇదిలావుంటే.. ఈ ఏడాది మే 20వ తేదీన ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్ గా పనిచేసి మానేసిన సుబ్రమణ్యం హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ఎమ్మెల్సీ అనంతబాబు కారణమని పోలీసులు తేల్చారు.  సుబ్రమణ్యాన్ని పద్దతి మార్చుకోవాలని మందలించే క్రమంలో  చేయి చేసకోవడంతో అతను కింద పడి తలకు గాయం కావడంతో మరణించినట్టుగా వైద్యులు తెలిపారు. అయితే ఈ కేసులో దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు.

ఈ కేసులో అరెస్టైన అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు. బెయిల్ మంజూరు చేయాలని ఆయన గతంలో కోర్టుల్లో బెయిల్ పిటిసన్లు దాఖలు చేశారు. అయితే అనంతబాబు బెయిల్ పిటిషన్లను కోర్టులు పలుమార్లు కొట్టివేశాయి. ఇదిలా ఉంటే  ఈ కేసులో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. 90 రోజుల్లోపుగా చార్జీషీట్ దాఖలు చేయకపోతే బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. 

మరోవైపు.. డ్రైవర్ సుబ్రమణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది.  వైద్య ఆరోగ్య శాఖలో అపర్ణకు జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం.ఈ మేరకు కలెక్టర్ కృతికా శుక్లా ఈ ఏడాది జూన్ చివర్లో ఉత్తర్వు పత్రాలను అందించారు.      
 

click me!