కరోనా వ్యాక్సినేషన్ ఉన్నందున ఎన్నికల వాయిదాకు లేఖ రాశాం: హైకోర్టులో ఎస్ఈసీపై ఏజీ

By narsimha lodeFirst Published Jan 18, 2021, 5:32 PM IST
Highlights

ఏపీ స్థానిక సంస్థల షెడ్యూల్ రద్దును సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఏపీ ఎస్ఈసీ దాఖలు చేసిన విచారణను ఏపీ హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. 

అమరావతి: ఏపీ స్థానిక సంస్థల షెడ్యూల్ రద్దును సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఏపీ ఎస్ఈసీ దాఖలు చేసిన విచారణను ఏపీ హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. సోమవారం నాడు ఈ పిటిషన్ పై సుధీర్ఘమైన విచారణ సాగింది.

also read:4 వేల మెయిల్స్ వచ్చాయి: ఎస్ఈసీ పిటిషన్ విచారణను ఈ నెల 18కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

ఈ నెల 8వ తేదీన ఏపీలో స్థానిక సంస్థల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.ఈ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను రద్దు చేస్తూ ఈ నెల 11వ తేదీన ఆదేశించింది.

ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ అదే రోజున ఏపీ ఎస్ఈసీ డివిజన్ బెంచ్ ధర్మాసనం ముందు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం నాడు విచారించింది.

సోమవారం నాడు ఉదయం నుండి సుధీర్ఘంగా విచారణ చేసింది. కరోనా వ్యాక్సిన్ నేపథ్యంలో  స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను వాయిదా వేయాలని పంచాయితీ సెక్రటరీ ఏపీ ఎస్ఈసీకి లేఖ రాసిన విషయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ గురించి హైకోర్టు ధర్మాసనం ఏజీ వద్ద పలు వివరాలు అడిగింది.  వ్యాక్సిన్ వేసేవారికి శిక్షణ ఇచ్చారా అని ప్రశ్నించింది. 50 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ వేస్తున్నారా అని ప్రభుత్వాన్ని కోర్టు అడిగింది. 

ఫ్రంట్ లైన్ వారియర్స్ కేటగిరి కింద ఎవరెవరు వస్తారని కోర్టు ప్రశ్నించింది.ధృవపత్రాల వారీగా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. 

మరో వైపు ఏపీ హైకోర్టు ఆదేశంతోనే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లినట్టుగా ఎస్ఈసీ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 

ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం సహకరించాలని  హైకోర్టు కూడా ప్రభుత్వానికి సూచించిన విషయాన్ని ఎస్ఈసీ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
 

click me!