
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని జిల్లాల్లో సబ్ డిస్ట్రిక్ట్లను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. భూముల రీసర్వే అనంతరం పాలన, పౌర సేవలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా చేపట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోంది. తిరుపతి, చిత్తూరు, అనకాపల్లి, కృష్ణా, పార్వతీపురం మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, కడప, కోనసీమ, ఏలూరు, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో సబ్ డిస్ట్రిక్ట్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. తక్షణమే ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read: కన్నీళ్లు వస్తున్నాయి..అందుకే ఇక్కడ అడుక్కుంటున్నాను: వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా
కొత్తగా ఏర్పాటు చేసిన సబ్ డిస్ట్రిక్ట్లలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటుఅవుతాయని ప్రభుత్వం పేర్కొంది. వీటిలో రిజిస్టార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని కూడా ఉత్తర్వులలో పేర్కొంది. గ్రామ సచివాలయాల పరిధిని కూడా ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. 1908, సెక్షన్ 5 ప్రకారం వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్న గ్రామాలు, ప్రాంతాలు కొత్త సబ్ డిస్ట్రిక్ట్ ల పరిధిలోకి వస్తాయని వెల్లడించింది.