
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో ఈరోజు నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో సహజ వనరులు పుష్కలంగా వున్నాయన్నారు. విశాఖ నగరంలో కాస్మోపాలిటిన్ కల్చర్ వుందని.. ఇక్కడ పునరుత్పాదక ఇంధన రంగంలో మంచి అవకాశాలు వున్నాయని రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా వుందని బుగ్గన వెల్లడించారు. ఈ విషయంలో వరుసగా మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ నెంబర్వన్గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
వనరులు, వసతుల కారణంగానే ఆయా ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయాధారిత ఉత్పత్తుల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో వుందని, నైపుణ్య మానవ వనరులకు రాష్ట్రం చిరునామాగా వుందన్నారు. పునరుత్పాదక శక్తి రంగంలో అవకాశాలకు సంబంధించి ఏపీకి పోటీనే లేదని రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రతి రంగంలో ముందడుగు వేస్తోందన్నారు.
Also REad: రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో జగన్
అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఒక్క ఫోన్ కాల్ తో పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించనున్నట్టుగా తెలిపారు. నైపుణ్యాభివృద్ది కాలేజీలతో పారిశ్రామికాభివృద్ది వైపు సాగుతున్నట్టుగా సీఎం చెప్పారు. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రో ఎనర్జీలో ఏపీదే కీలకపాత్ర అని సీఎం జగన్ తెలిపారు. రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలతో ఇవాళ ఒప్పందాలు చేసుకున్నట్టుగా సీఎం జగన్ ప్రకటించారు. ముఖ్యమైన జీ20 సదస్సుకు ఏపీ రాష్ట్రం అతిథ్యమివ్వనుందని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులున్నాయని సీఎం జగన్ వివరించారు. రాష్ట్రంలో ఆరు పోర్టులున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొత్తగా మరో నాలుగు పోర్టులు కూడా రానున్నాయని జగన్ ఆయన తెలిపారు. ఏపీ కీలక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. 20 రంగాల్లో ఆరు లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా ముందుకు సాగుతున్నామని సీఎం జగన్ తెలిపారు.
స్నేహపూర్వక పారిశ్రామిక విధానంతో ముందుకు వెళ్తున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు. ఇవాళ 92 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందన్నారు. 340 సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్టుగా సీఎం జగన్ ప్రకటించారు. పెట్టుబడులకే కాదు ప్రకృతి అందాలకు కూడా విశాఖపట్టణం నెలవు అని సీఎం చెప్పారు. ఏపీ రాష్ట్రంలో క్రియాశీలక ప్రభుత్వం అధికారంలో వుందని.. రాష్ట్రంలో విస్తారంగా భూమి అందుబాటులో ఉన్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి ఎగుమతులు పెరిగినట్టుగా సీఎం చెప్పారు.