
అమరావతి: ఏపి ఉద్యోగ సంఘాల నాయకులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి బెదిరించినట్లు విమర్శలు వస్తున్నాయి. సజ్జల రామకృష్ణా రెడ్డితో ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు ఫోన్ లో మాట్లాడిన రికార్డులపై ట్రోలింగ్ జరుగుతోంది. ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశమవుతుండగా సజ్జల రామకృష్ణా రెడ్డి ఫోన్ చేసి బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. దానిపై ఉద్యోగ సంఘాల నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు.
ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు. సజ్జల రామకృష్ణా రెడ్డి తమకు ఫోన్ చేసిన మాట వాస్తవమేనని, అయితే, ఆయన బెదిరించలేదని వారు స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ ప్రభుత్వంతో ఘర్షణ వద్దని చెప్పారని వారు వివరించారు. సచివాలయంలో తమకు అందుబాటులో ఉండేది సజ్జల రామకృష్ణా రెడ్డి ఒక్కరేనని వారు చెప్పారు.
ఆర్థిక మంత్రి గానీ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారి గానీ తమకు అందుబాటులో ఉండరని, సజ్జల మాత్రమే అందుబాటులో ఉంటారని వారు చెప్పారు. రెండు జెఏసీలు కలిపిపోతున్న సందర్భంగా తాము సమావేశం పెట్టుకున్నామని, తాము కలిసిపోతున్న విషయాన్ని తెలియజేసి, ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పడానికి సమావేశం ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. రెండు జెఏసీలు కలిసిపోతున్న విషయాన్ని తాము సజ్జలకు చెప్పామని, దాంతో తమకు ఆయన శుభాకాంక్షలు తెలిపారని వారు వివరించారు. తాము ఏ రాజకీయ పార్టీకి కూడా తొత్తులం కాదని వారు చెప్పారు.
ఉద్యోగ సంఘాల నాయకులను సజ్జల రామకృష్ణా రెడ్డి బెదిరించారని, దాంతో ఉద్యోగ సంఘాల నాయకులు వెనక్కి తగ్గారని విమర్శలు వస్తున్నాయి. సజ్జలతో ఉద్యోగ సంఘాల నేతలు ఫోన్ లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.