రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు.. అంతా ఉచితమే: జగన్ ఆదేశాలు

Siva Kodati |  
Published : Apr 12, 2020, 03:03 PM IST
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు.. అంతా ఉచితమే: జగన్ ఆదేశాలు

సారాంశం

రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో అందరికీ మాస్కులు ఉచితంగా పంపిణీ చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో అందరికీ మాస్కులు ఉచితంగా పంపిణీ చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్ నివారణ చర్యలు, లాక్‌డౌన్ తదితర అంశాలపై ఆదివారం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికి మూడు మాస్కుల చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కులను పంపిణీ చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. హైరిస్క్ ఉన్న వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.

Also Read:సడలింపులు వద్దు... నెలాఖరు వరకు లాక్‌డౌన్ ఉండాల్సిందే: జగన్‌కు కన్నా లేఖ

రాష్ట్రంలోని 1.47 కోట్ల కుటుంబాల్లో 1.43 కోట్ల కుటుంబాలపై మూడో సర్వే పూర్తయ్యిందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు శనివారం రాత్రి వరకు 32,349 మందిని రిఫర్ చేయగా, వీరిలో 9,107 మందికి పరీక్షలు అవసరమని వైద్యులు నిర్థారించారు.

అయితే 32,349 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని జగన్ ఆదేశించారు. కోవిడ్ 19 కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45 వేల కోవిడ్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ వ్యాప్తి, ఉద్ధృతిని అంచనా వేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు జగన్‌కు వివరించారు.

పెద్దలు, టీబీ, బీపీ, డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. వీరిలో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యుత్తమ ఆసుపత్రుల్లో చేర్పించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి... రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్‌, మార్కింగ్స్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని తెలిపారు. ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 417 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

Also Read:కరోనా పై అన్ని తానై: ఈ లవ్ అగర్వాల్ మన తెలుగు ఆఫీసరే!

కాగా లాక్‌డౌన్ అమలు, కరోనా కట్టడి తదితర అంశాలపై శనివారం ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను రెడ్‌జోన్‌లకే పరిమితం చేయాలని ప్రధానికి తెలియజేశారు. లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వారైతులు పూర్తిగా దెబ్బతిన్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

ఒంగోలు పర్యటనలో లోకేష్ ఫాన్స్ ఫాలోయింగ్ చూడండి | Nara Lokesh Ongole Tour
ఏపీ గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు కీలక ప్రెస్ మీట్| Nagababu Appointed AP Green Committee Chairman