
అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 14వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. నిర్ణీత షెడ్యూల్ లోపుగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకొంది. ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు జగన్ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు.
ఈ నెల 14వ తేదీన ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ లో సీఎం పోలవరం ప్రాజెక్టు చేరుకొంటారు. పోలవరం పనుల పురోగతిని స్వయంగా పరిశీలించనున్నారు.అనంతరం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.ఈ నెల 14వ తేదీన సీఎం జగన్ పోలవరం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా శనివారం నాడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్, పోలవరం ప్రాజెక్ట్ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తైతే రాష్ట్రంలో సాగు తాగునీటి కష్టాలు తీరుతాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయాలని జగన్ సర్కార్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.