ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి రుణాలు తీసుకున్నవారికోసం వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని జగన్ సర్కార్ ప్రకటించింది. తాజాగా ఈ స్కీమ్ కు సంబంధించిన విధివిధానాలపై చర్చించేందుకు సీఎం జగన్ అధికారులతో సమావేశమయ్యారు.
అమరావతి: ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికోసం వన్టైం సెటిల్మెంట్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ స్కీంపై చర్చించేందుకు గృహనిర్మాణశాఖ అధికారులతో సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ స్కీంకు సంబంధించిన వివరాలు, అమలుకోసం రూపొందించిన విధివిధానాలను అధికారులు సీఎంకు తెలిపారు. వన్ టైమ్ సెటిల్ మెంట్ కు జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంగా పేరు ఖరారుచేసిన అధికారులు తెలిపారు. వివిధ ప్రతిపాదనలను సీఎంకు వివరించిన అధికారులు.
ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వన్ టైమ్ సెటిల్ మెంట్ కు సంబంధించిన డేటాను సెప్టెంబర్ 25 నుంచి అప్లోడ్ చేయనుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సచివాలయాలకు ఈడేటాను పంపనున్నట్లు... క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వన్టైం సెటిల్మెంట్ పథకం సొమ్మును చెల్లించేలా వెసులుబాటు కల్పించనున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో వన్టైం సెటిల్మెంట్ అర్హుల జాబితా ప్రదర్శించనున్నట్లు... పేరు ఖరారైన తర్వాత నిర్దేశిత రుసుము చెల్లింపుతో వారికి ఇంటిపైన, స్థలాలపైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు వుంటాయని అధికారులు తెలిపారు. వన్ టైం సెటిల్మెంట్ స్కీంకు మంచి స్పందన వస్తోందని సీఎంకు తెలిపారు అధికారులు. ఈ క్రమంలో ఓటీఎస్ పథకం అమలుకు గ్రామ, వార్డు సచివాలయాలు పాయింట్గా ఉండాలని సీఎం సూచించారు.
ఇక పేదలందరికీ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై కూడా సీఎం సమీక్షించారు. ఇప్పటివరకూ గ్రౌండ్ అయిన ఇళ్లు 10.31 లక్షలని అధికారులు తెలిపారు. ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఈమేరకు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. లబ్ధిదారులు ఎంచుకున్న ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే కట్టించనున్న ఇళ్ల నిర్మాణ పనులు అక్టోబరు 25 నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు, మేస్త్రీలతో కలిపి 18వేలకుపైగా గ్రూపులను ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు.
read more నాణ్యతలో తగ్గేదేలే... విద్యార్థుల బూట్లను చేతబట్టి పరిశీలిస్తున్న సీఎం జగన్ (ఫోటోలు)
ఖర్చులు తగ్గించుకునే విధానాల్లో భాగంగా ఇళ్లనిర్మాణం జరుగుతున్న లే అవుట్ల వద్దే ఇటుక తయారీ యూనిట్లను ప్రోత్సహిస్తున్నామన్న అధికారులు తెలిపారు. దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తున్నాయన్నారు అధికారులు. మిగిలిన నిర్మాణ సామగ్రి ధరలను, ఖర్చులను అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
జగనన్న కాలనీల్లో మౌలికసదుపాయాల కల్పనపైనా సీఎం అధికారులతో చర్చించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై డీపీఆర్లు సిద్ధంచేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. కాలనీని ఒక యూనిట్గా పనులు అప్పగించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఏపీఎస్హెచ్సీఎల్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రెవెన్యూశాఖ (భూములు) ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సెక్రటరీ రాహుల్ పాండే, ఏపీఎస్హెచ్సీఎల్ ఎండీ ఎన్ భరత్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.