మీ చర్యలు భేష్.. కలెక్టర్‌ను అభినందించిన సీఎం జగన్

By Siva KodatiFirst Published Aug 26, 2020, 4:12 PM IST
Highlights

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజును ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి జగన్ గోదావరి వరద పరిస్ధితి, కోవిడ్ 19, ఇళ్ల పట్టాలు, నాడు-నేడు, వైఎస్సార్ చేయూత, ఆర్‌బీకే తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజును ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి జగన్ గోదావరి వరద పరిస్ధితి, కోవిడ్ 19, ఇళ్ల పట్టాలు, నాడు-నేడు, వైఎస్సార్ చేయూత, ఆర్‌బీకే తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా గోదావరి వరద సహాయక చర్యలు, పునరావాసం ఏర్పాట్లు బాగా చేశారంటూ జగన్ కలెక్టర్ ముత్యాలరాజును అభినందించారు. సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టడంతో పాటు పునరావాస కేంద్రాల ఏర్పాటు, వారికి అందించాల్సిన సహాయాలు సకాలంలో అందించడంలో తీసుకున్న చొరవను ముఖ్యమంత్రి ప్రశంసించారు.

ముంపునకు  గురైన గృహాల నష్టం అంచనా నివేదికలు త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్ 7 నాటికి బాధితులకు సహాయం అందేలా ప్రణాలిక రూపొందించుకోవాలని సీఎం సూచించారు.

అలాగే వరద బాధిత కుటుంబాలకు రూ. 2 వేలు అందించడంతో పాటు అదనంగా 25 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్ అందజేయాలని ఆదేశించారు.

ఆరోగ్య శిబిరాలు నిర్వహించడంతో పాటు ఆరోగ్య బృందాలు కూడా పర్యటించి వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ముత్యాలరాజు మాట్లాడుతూ... వరద ముంపునకు గురైన ఇళ్ల నష్టం అంచనా నమోదు ప్రక్రియను ప్రారంభించామని వెల్లడించారు.

కోతకు గురైన పాత పోలవరం నెక్లెస్ బండ్‌ను పటిష్టపరిచే పనులను చేపట్టామని తెలిపారు. రానున్న మూడు నెలల్లో వరదల వచ్చినా ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుందని తెలిపారు. దీనిపై జగన్ స్పందిస్తూ... ఏదైనా సహాయం అవసరమైతే తన కార్యదర్శి ధనుంజయ్ రెడ్డితో మాట్లాడాలని సూచించారు. 

click me!