175కి 175 సీట్లే మన టార్గెట్.. కష్టపడితే పెద్ద విషయం కాదు : అద్దంకి వైసీపీ కార్యకర్తలతో జగన్

By Siva KodatiFirst Published Oct 19, 2022, 5:17 PM IST
Highlights

ఎన్నికలకు ఎంతో సమయం లేదని సిద్దంగా వుండాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. బుధవారం అద్దంకి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. అందరం కలిసికట్టుగా 175కి 175 సీట్లు సాధిద్దామన్న జగన్.. అదేమి పెద్ద కష్టం కాదని వ్యాఖ్యానించారు. 

అద్దంకి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై ప్రతి అడుగూ ఎన్నికల దిశగానే వుండాలన్నారు. అందరం కలిసికట్టుగా 175కి 175 సీట్లు సాధిద్దామన్న ఆయన.. అదేమి పెద్ద కష్టం కాదని వ్యాఖ్యానించారు. 19 నెలలలో ఎన్నికలు వస్తున్నాయని సీఎం జగన్ గుర్తుచేశారు. అద్దంకి నియోజకవర్గానికి గడిచిన మూడేళ్లలో రూ.1,081 కోట్లు ఇచ్చామని సీఎం తెలిపారు. 

అంతకుముందు ఈ నెల 13న కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన వైసీపీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తున్నాయని.. ఈరోజు నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్ సూచించారు. కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం సాధిస్తామని.. దీనిలో భాగంగా గడపగడపకూ కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో చేపడుతున్నామని జగన్ తెలిపారు. ఎమ్మెల్యేలు సంబంధిత నియోజకవర్గాల్లో తిరుగుతున్నారని... గ్రామంలో ప్రతీ ఇంటికి వెళ్తున్నారని సీఎం చెప్పారు. ప్రభుత్వంలో వున్న మనం.. గ్రామ స్థాయిల్లో కూడా బాధ్యతలను నిర్వహిస్తున్నామని జగన్ అన్నారు. 

Also Read:ఎన్నికలు ఎంతో దూరం లేవు.. సిద్ధంకండి : ఆలూరు కార్యకర్తలకు జగన్ పిలుపు

ఇకపోతే... గత నెలలో గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లో 27 మందికి క్లాస్ పీకారు వైఎస్ జగన్. కొందరు మంత్రులు , ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన ఆయన ఐదుగురు రీజనల్ కో ఆర్డినేటర్లకు వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోవాలని లేదంటే పదవులకు రాజీనామా చేసి తప్పుకోవాలని తేల్చిచెప్పారు జగన్. అక్టోబర్ 15 నుంచి ప్రతీ ఎమ్మెల్యేకు ఒక ఐప్యాక్ ప్రతినిధిని అటాచ్ చేస్తానని సీఎం పేర్కొన్నారు. అటు జగన్ క్లాస్ తీసుకున్న వారిలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తానేటి వనిత, రోజా , కారుమూరి నాగేశ్వరరావులు వున్నారు. వీరితో పాటు మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆళ్ల నాని, కొడాలి నానికి ఆదేశాలు జారీ చేశారు.

అలాగే ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గ్రంథి శ్రీనివాస్, శిల్పా చక్రపాణి, చిర్ల జగ్గిరెడ్డి, కోడుమూరి శ్రీనివాసులు, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు జగన్. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంకా యాక్టివ్‌గా పనిచేయాలని సూచించారు. సీఎం క్లాస్ తీసుకున్న వారిలో మంత్రులు , మాజీ మంత్రులే ఎక్కువగా వున్నారు. 

అసెంబ్లీ ఎన్నికలకు 19 నెలల సమయం వుందని పదేపదే గుర్తుచేశారు జగన్. మీరంతా నాతో పాటు నా చేయి పట్టుకుని నడిచినవారేనని జగన్ పేర్కొన్నారు. పనితీరు మెరుగు పర్చుకోవాలని సీఎం ఆదేశించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు అభ్యర్ధుల మార్పు వుంటుందని జగన్ వెల్లడించారు. పనితీరు బాగోని నేతలను మారుస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. వారసులకు టికెట్లు ఇచ్చే అంశంపై జగన్ స్పందించారు. 

click me!