40 ఏళ్లు అనుభవమున్న వారైనా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే: జగన్

By Siva KodatiFirst Published Jul 17, 2019, 10:45 AM IST
Highlights

సీట్ల కేటాయింపుపై ఏపీ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పీకర్‌ను కోరారు.

సీట్ల కేటాయింపుపై ఏపీ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పీకర్‌ను కోరారు. దీనిపై స్పందించిన అధికార పక్షం నిబంధనలను అనుసరించే అచ్చెన్నాయుడికి సీటు కేటాయించామని తెలిపింది.

సభా సంప్రదాయాలు పాటించాలని చంద్రబాబు కోరడంతో.. తనను ఎవరు బెదిరించలేరని స్పీకర్ తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్నపై సమాధానం ముగిసిన తర్వాత ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నించారు.

ఇదే అంశంపై అంబటి రాంబాబు స్పందిస్తూ.. చంద్రబాబు సింపతీ డ్రామాలు ఆడుతున్నారని.. ప్రజల్లో సానుభూతి కోసమే ప్రతిపక్షనేత డ్రామాలని ఎద్దేవా చేశారు. చర్చకు అడగటంలో తప్పులేదని అంతేకాని బెదిరిస్తే బెదిరిపోయే వారు ఇక్కడ ఎవరు లేరని అంబటి హెచ్చరించారు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందిస్తూ సీట్ల కేటాయింపు సభ నిబంధనల ప్రకారమే జరిగిందని తేల్చి చెప్పారు. తమ సభ్యుడు శ్రీధర్ రెడ్డి మొదటి నుంచి కూడా ఒకే సీటులో కూర్చొంటున్నారని.. బాబు పక్కనే కూర్చోవాలని అతను ఆశపడుతున్నాడని జగన్ సెటైర్లు వేశారు.

ఆరు సార్లు ఎమ్మెల్యే అయినా.. మొదటి సారి ఎమ్మెల్యే అయినా  ఒకటే రూల్స్ బుక్ ఫాలో అవ్వాలని సీఎం అన్నారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంగ్ల అక్షరాల క్రమంలో సభ్యులకు సీట్లు కేటాయిస్తారని దాని ప్రకారం అచ్చెన్నాయుడు ముందు వరుసలో ఉండాలన్నారు.

గతంలో ఎన్టీఆర్, వైఎస్‌లు సీఎంలుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను ఆయన గుర్తు చేశారు. అధికారపక్షం తమపై చేసే విమర్శలక సమాధానాలు ఇచ్చుకోలేని పరిస్ధితి లేనప్పుడు తామంతా ఇక్కడ కూర్చోవడం కూడా దండుగని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల బలం ఎక్కువగా ఉందని నన్ను బెదిరంచాలని చూస్తే తాను భయపడనని చంద్రబాబు స్పష్టం చేశారు. 

click me!