వాలంటీర్లతో వైసీపీకి ప్రచారం.. జగన్ కంటే మోడీ సంక్షేమమే ఎక్కువ : సోము వీర్రాజు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 28, 2023, 6:48 PM IST
Highlights

వాలంటీర్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. జగన్ నవరత్నాల కంటే మోడీ సంక్షేమమే ఎక్కువని ఆయన అన్నారు. ఎస్సీలను వైసీపీ ప్రభుత్వం ఓటు బ్యాంక్‌గా వాడుకుంటోందని వీర్రాజు ఆరోపించారు.

అన్ని పార్టీలు మీటింగ్‌‌లు పెట్టి వెళ్లిపోయాయని ,కానీ ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీయేనన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. శనివారం విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్‌లో విజయవాడలో ఎస్సీల బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఎస్సీలను వైసీపీ ప్రభుత్వం ఓటు బ్యాంక్‌గా వాడుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, వైసీపీ నేతలంతా మాఫియా నాయకుల్లా మారిపోయారని వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల ద్వారా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారని.. జగన్ నవరత్నాల కంటే మోడీ సంక్షేమమే ఎక్కువని సోము వీర్రాజు పేర్కొన్నారు. 

ఇకపోతే.. గురువారం సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ముందు.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు బలాదూర్ అన్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే కేంద్ర పథకాలపై చంద్రబాబు, జగన్ చర్చకు సిద్ధమా అని సోము వీర్రాజు సవాల్ విసిరారు. బీజేపీతోనే వుంటామని పవన్ స్వయంగా చెప్పారని ఆయన తెలిపారు. బీజేపీ, జనసేన పొత్తుపై అనుమానాలుంటే పవన్‌నే అడగాలని సోము వీర్రాజు పేర్కొన్నారు . 2024లో బీజేపీ, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

ALso Read: బీజేపీతోనే జనసేన.. అనుమానమా, పవన్‌ని అడగండి : పొత్తులపై మరోసారి తేల్చేసిన సోము వీర్రాజు

కాగా.. పొత్తులకు సంబంధించి జనసేన, బీజేపీ మధ్య గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. తాను బీజేపీతోనే వున్నానని పవన్ కల్యాణ్ చెబుతుంటే.. కాషాయ నేతలు మాత్రం ఎలాంటి ప్రకటనా చేయడం లేదు. దీంతో ఇరు పార్టీల శ్రేణులు కన్ఫ్యూజన్‌కు గురవుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. బీజేపీతో పొత్తులోనే వున్నామంటూ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారని అన్నారు. పొత్తులపై తామిద్దరం క్లారిటీతో వున్నామని.. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని ఆయన పేర్కొన్నారు. అయితే మధ్యాహ్నం సోము వీర్రాజు మాటలకు వున్న వ్యత్యాసంపై ఏపీలో చర్చ జరుగుతోంది. ఇదిలావుండగా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఏపీ బీజేపీ చీఫ్‌గా సోము వీర్రాజు కొనసాగుతారని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ దియోధర్ ప్రకటించారు. 

రెండ్రోజుల క్రితం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, వచ్చే ఎన్నికలు, ప్రభుత్వంపై అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. అయితే ఈ సందర్భంగా చేసిన రాజకీయ తీర్మానంలో జనసేనతో పొత్తు గురించి ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం చర్చకు దారి తీస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలతో ఎలాంటి పొత్తు వుండదని అందులో తెలిపారు. కేవలం ప్రజలతోనే బీజేపీ పొత్తు వుంటుందని తీర్మానంలో పేర్కొన్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో వైసీపీ అధోగతి పాలనపై పోరాటం చేయాలని తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సీఎంల పేర్లు, వారి కుటుంబ సభ్యుల పేర్లు పెట్టడంపై ఇందులో దుయ్యబట్టారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. పొత్తు, ఎత్తులతో బీజేపీకి సంబంధం లేదని .. కేవలం భావ సారుప్యత కలిగిన పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటామని తీర్మానించారు.

click me!