దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా,బోయలను ఎస్టీల్లో చేర్చాలని ఏపీ అసెంబ్లీ తీర్మానం

By narsimha lodeFirst Published Mar 24, 2023, 3:44 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ  రెండు  కీలక తీర్మానాలు  చేసింది. ఈ తీర్మానాలను  కేంద్రాలనికి పంపుతున్నామని  ఏపీ సీఎం  జగన్  ప్రకటించారు.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శుక్రవారం నాడు  రెండు కీలక తీర్మానాలను ఆమోదించింది.  బోయ, వాల్మీకి  కులాలను  ఎస్టీల్లో  చేర్చుతూ  ఏపీ అసెంబ్లీ  తీర్మానం  చేసింది.  క్రిస్టియన్లుగా మారిన దళితులను  ఎస్సీలుగా  పరిగణించాలని  కోరుతూ  తీర్మానం చేసింది. ఏకసభ్య కమిషన్  నివేదిక ఆధారంగా  తీర్మానాలు  చేసిందని ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు. 

దళిత క్రిస్టియన్లను  ఎస్సీలుగా  గుర్తించాలని  మంత్రి మేరుగ నాగార్జున అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో  చేర్చాలని  కోరుతూ  మత్రి చెల్లుబోయిన వేణుగోపాల్  అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు.  ఈ రెండు తీర్మానాలను  ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.  ఈ తీర్మానాలపై  ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. 

ఏపీ అసెంబ్లీ ఆమోదించిన  ఈ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నామని ఏపీ సీఎం జగన్  చెప్పారు.  రిటైర్డ్ ఐఎఎస్ అధికారి  శ్యామ్యూల్ ఆనంద్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని సీఎం జగన్  గుర్తు  చేశారు. 

తాను పాదయాత్ర  చేసిన సమయంలో  వాల్మీకి, బోయలను  ఎస్టీల్లో  చేర్చాలని  వారు కోరిన విషయాన్ని  సీఎం జగన్  గుర్తు  చేశారు.  ఎన్నికల సమయంలో  ఈ మేరకు  హామీలు కూడా ఇచ్చామన్నారు. ఈ హామీలో భాగంగానే  ఏకసభ్య కమిషన్ ను  ఏర్పాటు  చేసినట్టుగా  జగన్  వివరించారు.  రాయలసీమ జిల్లాల్లో  ఈ కులాల, ఆర్ధిక, సామాజిక స్థితిగతులపై అధ్యయనం  చేసి  ప్రభుత్వానికి  ఏక సభ్య కమిషన్ నివేదికను అందించిందని  ఏపీ సీఎం జగన్  చెప్పారు.

 ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా తీర్మానం  చేసినట్టుగా సీఎం తెిపారు. ఏజెన్సీలో ఉన్న ఎస్టీ కులాలపై  దీని ప్రభావం ఉండదని  సీఎం జగన్  స్పష్టం  చేశారు.   గిట్టనివారు ఓట్ల కోసం ఈ విషయమై దుష్ప్రచారం చేస్తున్నారని  ఆయన  చెప్పారు.  ఎస్టీలు తనను గుండెల్లో  పెట్టుకున్నారని  సీఎం జగన్  ఈ సందర్భంగా ప్రస్తావించారు.  ఎస్టీలను తాను కూడా వారిని గుండెల్లో పెట్టుకుంటానని సీఎం జగన్  హామీ ఇచ్చారు.  

also read:ఏపీ అసెంబ్లీలో గందరగోళం: 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

దళిత క్రిస్టియన్లను  ఎస్సీల్లో  చేర్చాలని  ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో  దివంగత వైఎస్ఆర్  హయంలో తీర్మానం  చేసిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు  చేశారు. ఇవాళ ఏపీ అసెంబ్లీ తీర్మానం  చేసిందని జగన్  చెప్పారు.  మతం  మారినంత మాత్రాన  వారి సామాజిక ఆర్ధిక స్థితిగతులు  మారవన్నారు. 

click me!