AP Floods: ఏపీలో పంట నష్టం, పరిహారం లెక్కలు ఇవి.. అసెంబ్లీలో మంత్రి కన్నబాబు ప్రకటన

By Siva KodatiFirst Published Nov 22, 2021, 2:39 PM IST
Highlights

రాష్ట్రంలో తుపాను, వరదల కారణంగా (ap floods) కొన్ని  జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అన్నారు వ్యవసాయ శాఖ (ap agriculture minister) మంత్రి కన్నబాబు (kannababu) . అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తుఫాను, వరద నష్టంపై ఆయన ప్రకటన చేశారు.

రాష్ట్రంలో తుపాను, వరదల కారణంగా (ap floods) కొన్ని  జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అన్నారు వ్యవసాయ శాఖ (ap agriculture minister) మంత్రి కన్నబాబు (kannababu) . అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తుఫాను, వరద నష్టంపై ఆయన ప్రకటన చేశారు. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో నష్ట తీవ్రత ఎక్కువగా వుందని కన్నబాబు వెల్లడించారు. ఈ బాధిత ప్రాంతాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించిందని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ (cm ys jagan) ప్రతిరోజూ పరిస్ధితులను సమీక్షిస్తున్నారని.. ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైందని, తిరిగి సాధారణ పరిస్ధితులను తీసుకురావానికి అన్ని విధాలా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సమీక్షలు నిర్వహించడంతో పాటు ఈరోజు కేబినెట్‌లో (ap cabinet) దీనిపై సుదీర్ఘంగా చర్చించామని వ్యవసాయ శాఖ మంత్రి పేర్కొన్నారు. 

ఎన్ని వ్యయ ప్రయాసలు ఎదురైనా సరే సాధారణ పరిస్ధితులు  నెలకొల్పేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిమగ్నం కావాలని సీఎం ఆదేశించారని కన్నబాబు చెప్పారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 34 మంది ప్రాణాలు కోల్పోయారని.. మరో 10 మంది గల్లంతయ్యారని.. వారి ఆచూకీ తెలియాల్సి వుంది. చనిపోయిన వారిలో ముగ్గురు రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైన ఉద్యోగులు కూడా వున్నారని వ్యవసాయ మంత్రి పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే చనిపోయిన 90 శాతం మంది కుటుంబాలకు పరిహారం అందజేశామని ఆయన సభకు వివరించారు.

ALso Read:హిందూపురంలో తృటిలో తప్పిన ప్రమాదం: వరద నీటిలో చిక్కుకొన్న ఆర్టీసీ బస్సు, 30 మంది ప్రయాణీకులు క్షేమం

8 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశామని.. 5 లక్షల 33 వేల 365 మంది రైతులు నష్టపోయారని వ్యవసాయ మంత్రి ప్రకటించారు. తక్షణ సాయం కోసం కలెక్టర్ల వద్ద ప్రత్యేక నిధులు వుంచాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని వివరించారు. వరద సహాయక చర్యల నిర్వహణలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే రూ.25 లక్షల ఆర్ధిక సాయాన్ని , కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. పాక్షికంగా ఇల్లు దెబ్బ తింటే ఇంటికి రూ,5,220 .. పూర్తిగా దెబ్బతింటే 95,000.. ధ్వంసమైన ఇళ్ల స్థానంలో కొత్తగా ఇల్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశించినట్లు కన్నబాబు తెలిపారు. 

విద్యుత్, రోడ్ల మరమ్మత్తులు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారని వెల్లడించారు. కలెక్టర్లు , ప్రభుత్వ యంత్రాంగం మానవత్వంతో వ్యవహరించి బాధిత కుటుంబాలను లిబరల్‌గా ఆదుకోవాలని సూచించినట్లు కన్నబాబు చెప్పారు. పాడిపశువులు చనిపోతే ఒక్కొక్క దానికి రూ.30,000.. గొర్రెలు, మేకలు చనిపోతే రూ.3 వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని కన్నబాబు తెలిపారు. పాడి పశువుల కోసం పశుగ్రాసం, దాణా సరఫరా తక్షణమే ప్రారంభించాలని చెప్పారు. పంట నష్టం వివరాలను లెక్కించాలని సీఎం ఆదేశించినట్లు  కన్నబాబు పేర్కొన్నారు. 80 శాతం సబ్సిడీతో విత్తనాలను సరఫరా చేయాలని నిర్ణయించిట్లు వెల్లడించారు. ఏ విత్తనం కావాలన్నా సబ్సిడీపై అందించాలని సీఎం ఆదేశించారని కన్నబాబు పేర్కొన్నారు. 

click me!