
చంద్రబాబుకు మరో విజయం. చంద్రబాబునాయడు మీద కేసు ఏదైనా సరే న్యాయస్ధానానికి వచ్చిందంటే ప్రత్యర్ధులు గెలిచేది కల్లే. గతంలో కూడా చంద్రబాబుపై పలువురు న్యాయస్ధానాన్ని ఆశ్రయించినా భంగపాటు తప్పలేదు. ఎవరికైనా అనుమానాలుంటే చరిత్రను తవ్వి చూస్తే అర్ధమవుతుంది.
తాజాగా ‘ఓటుకు నోటు కేసు’ విచారణలోచంద్రబాబును విచారించాలంటూ వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసును కోర్టు కొట్టేసింది. కేసులో చంద్రబాబు పాత్రను విచారించాలంటూ ఆళ్ళ ఏసిబి కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పై ఏసిబి కోర్టు ఏసిబికి నోటీసులు ఇచ్చింది. సమాధానం చెప్పటానికి నాలుగు వారాలు గడువు కూడా ఇచ్చింది.
అయితే, ఏసిబి కోర్టు నోటీసులను సవాలు చేస్తూ చంద్రబాబు హైకోర్టులో కేసు దాఖలు చేసారు. దానిపై విచారణ జరిపిన హై కోర్టు సదరు ఉత్తర్వులను కొట్టేసింది. చంద్రబాబును విచారించాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పటం గమనార్హం.
దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన తెలంగాణా ఎంఎల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ ఓటును కొనుగోలు చేసేందుకు టిడిపి ప్రయత్నించింది. ఎంఎల్ఏకు డబ్బు ఇస్తున్న సమయంలో టిడిపి ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి డబ్బుతో సహా పట్టుబడ్డాడు.
అయితే, అదే సమయంలో స్టీఫెన్ తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో టేపులు కూడా వెలుగు చూసాయి. పలువురిపై కేసు దాఖలైంది కానీ ఆ తర్వాత విచారణ నత్తను తలపిస్తోంది. కేసులో సూత్రదారిగి ప్రచారంలో ఉన్న చంద్రబాబును మాత్రం ఏసిబి ఇంత వరకూ విచారించలేదు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆళ్ళ ఏసిబి న్యాయస్ధానంలో కేసు దాఖలు చేసారు.
తన పాత్రపై విచారణ జరిపించాలన్న ఆళ్ల పిటీషన్ ఆధారంగా ఏసిబి కోర్టు నోటీసులు ఇవ్వటాన్ని చంద్రబాబు హై కోర్టులో సవాలు చేసారు. ఆ కేసులోనే తాజాగా చంద్రబాబుకు అనుకూలంగా న్యాయస్ధానం తీర్పు చెప్పింది.
చంద్రబాబుపై దాఖలు చేసిన ఏ కేసులో కూడా న్యాయస్ధానంలో ఇంతవరకూ ఎవరూ విజయం సాధించలేదు. ఈ విషయాలు తెలిసి కూడా ఆళ్ళ కేసు దాఖలు చేయటమంటే సమయాన్ని, డబ్బును వృధా చేసుకోవటమే.