ఉచిత పథకాలపై కేబినెట్ భేటీలో చర్చే లేదు.. మరేం నిర్ణయాలు తీసుకున్నారు?

By Galam Venkata RaoFirst Published Jul 16, 2024, 5:30 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రెండో కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా మంత్రులతో చర్చించి పలు కీలక నిర్ణయాలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ రెండో సమావేశం ముగిసింది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీల అమలుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కేబినెట్‌ భేటీ అనంతరం ఈ వివరాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. 

దేశంలో ఎక్కడా లేని భయంకరమైన చట్టాన్ని జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి పార్థసారథి తెలిపారు. నీతి ఆయోగ్‌ చేసిన ప్రతిపాదనలకు, ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కి పోలికే లేదన్నారు. ఇష్టమొచ్చినట్లు మార్పులు చేశారని... దీంతో ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం భూ వివాదాలను పెంచేలా తయారైందన్నారు. రెవెన్యూ వ్యవస్థను ధ్వంసం చేసేలా ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ఉందన్నారు. తమ ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకుంటారేమో అని ప్రజలు భయాందోళన చెందారన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే యజమానులకు ఒరిజినల్‌ సర్టిఫికెట్‌ ఇవ్వం అనడమేంటని ప్రశ్నించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కారణంగా ప్రజల ఆస్తులకు రక్షణ లేదనే భావన వ్యక్తమైందని చెప్పారు. ఈ నేపథ్యంలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ బిల్లుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు. అలాగే, గత ప్రభుత్వంతో వివిధ ప్రైవేటు సంస్థలు చేసుకున్న ఇసుక ఒప్పందాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. లాభాపేక్ష లేకుండా కేవలం లోకల్‌ బాడీ సీనరేజీ, లోడింగ్‌ ఛార్జి మాత్రమే వసూలు చేసేలా ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చినట్లు తెలిపారు.

Latest Videos

కేబినెట్ ఆమోదించిన అంశాలివే...

ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్- 2022 రద్దును ఆమోదిస్తూ కేబినెట్ తీర్మానం: ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ -2022 పై ప్రజలకు పలు సందేహాలు, అనుమానాలు, భయాలు ఉన్నాయన్న విషయం పలు పత్రికలు, ఇతర మీడియా సంస్థల ద్వారా  తేటతెల్లమైందని ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ తెలిపింది. దీంతో ఈ చట్టాన్ని రద్దు పర్చాలని భూయజమానుల నుండి తీవ్రస్థాయిలో ఒత్తిడి మొదలైంది.

ఈ చట్టాన్ని రద్దు పరచడానికి ఏపీ టైటిలింగ్ అథారిటీ ప్రస్తావించిన కారణాలు : నీతి ఆయోగ్ రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా (టీఆర్వో)గా ప్రభుత్వ అధికారి ఉండాలి. కానీ  ఆ స్థానంలో గత ప్రభుత్వం ఎటువంటి అర్హత లేని వ్యక్తులను కూర్చోబెట్టేందుకు అవకాశం కల్పించే విధంగా మార్పులు చేసింది. ఈ యాక్ట్ ప్రకారం సివిల్ కోర్టుల ప్రమేయం పూర్తిగా ఉండదు. టీఆర్వో వద్ద సమస్య ఉత్పన్నమైతే నేరుగా వ్యయ ప్రయాసలకోర్చి హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులు చేసే వారసత్వ ఆస్తుల బదలాయింపులు సివిల్ కోర్టుల ద్వారా చేసేందుకు వీలుండదు. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రస్తుత ఉన్న రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కనుమరుగయ్యే పరిస్థితి. ఈ చట్టం చాలా హడావిడిగా స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా రూపొందించారు. ఈ చట్టం ద్వారా రిజిస్ట్రేషన్ పొందిన భూ యజమానికి జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ సదరు టీఆర్వో వద్దే ఉంటాయి. దీని వల్ల ప్రభుత్వం సదరు ఆస్తులను తనఖా పెట్టుకునే అవకాశం ఉందని భూ యజమానులు భయాందోళనకు గురయ్యారు. ఇది ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తుందని భూ యజమానులు సంఘ విద్రోహ శక్తుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేలా చేస్తుంది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (టీఆర్ వో)లు జారీ చేసే జనరల్ పవర్ ఆఫ్ అటార్ని (జీపీఏ) లు భూయజమానులను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. ఎలాంటి శిక్షణ, అవగాహన లేని టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారుల వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరిన్ని అవరోధాలు, గొడవలు ఉత్పన్నమయ్యే పరిస్థితి. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులు, టైటిల్ అప్పిలేట్ అధికారులు స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు చేసే పరిస్థితి దాపురించే అవకాశం. ఈ నేపథ్యంలో ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేబినెట్, ప్రజా ప్రతినిధులందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
 
ఉచిత ఇసుక పాలసీ: ఇసుక, గనుల పాలసీ - 2019, మరింత మెరుగైన ఇసుక విధానం -2021లను రద్దు చేస్తూ ఉచిత ఇసుక మెకానిజం- 2024 ఏర్పాటయ్యేంత వరకు ప్రభుత్వానికి ఆదాయం లేకుండా ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించే మధ్యంతర వ్యవస్థ ఏర్పాటు చేసేలా జూలై 8న జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 43కు కేబినెట్ ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు ఆయా సంస్థలతో ఉన్న ఒప్పందాలను నిలుపుదల చేయడం, ఇసుకకు సంబంధించిన స్టాక్‌ను సంబంధిత అధికారులకు అప్పగించాలని మైన్స్ అండ్ జియాలజీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 

శాండ్, మైనింగ్ పాలసీ -2022, మరింత మెరుగైన ఇసుక పాలసీ- 2021లను క్షుణ్ణంగా అధ్యయనం చేసి... వినియోగదారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ పర్యావరణ హితంగా సమగ్ర ఇసుక విధానం (కాంప్రహెన్సివ్ శాండ్ పాలసీ) - 2024ను రూపొందించాల్సిన అవసరం ఉంది. వినియోగదారులకు సరసమైన ధరలకు ఇసుక లభించేలా చూడటం, శాండ్ ఆపరేషన్‌లో పారదర్శకతను పెంపొందించడం, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టడం, పర్యావరణ హితం కోరుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) ఇచ్చిన మార్గదర్శకాల మేరకు సమగ్ర ఇసుక విధానం -2024ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.


ధాన్యం కొనుగోలుకు రూ.2వేల కోట్లు రుణం: 2024-25 సంవత్సరానికి గానూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ కోసం రూ.2000 కోట్ల రుణాన్ని వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల సంస్థ పొందేలా అనుమతిస్తూ జూన్ 28న రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 6లో రాష్ట్ర ప్రభుత్వ హామీని కోరుతూ చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

గత రబీ సీజన్‌లో సేకరించిన వరి ధాన్యానికి 84 రోజులు గడిచినా ఎటువంటి సొమ్ము చెల్లించకుండా తాత్సారం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే బకాయిపడ్డ  సొమ్ము రూ.1000 కోట్లు సదరు రైతులకు చెల్లించింది. రైతులకు కనీస మద్దతు ధర కల్పించే పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి ఆహార, పప్పు ధాన్యాలను సేకరించి జాతీయ ఆహార భద్రతా చట్టానికనుగుణంగా తెల్ల రేషన్ కార్డు కలిగి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రాయితీ ధరలకు అందిస్తున్న విషయం విదితమే. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ధాన్య సేకరణకు రుణాలను తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
 
మరో రూ.3,200 కోట్ల రుణం: 2024-25 సంవత్సరానికి గానూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ కోసం ఏపీ మార్క్ ఫెడ్‌కు ఎన్సీడీసీ (నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి వర్కింగ్ కేపిటల్ అసిస్టెన్స్ రూపేణా రూ.3,200 కోట్ల కొత్తగా రుణాన్ని పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వ హామీని కోరుతూ వ్యవసాయ, సహకార శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

పంటల బీమా ప్రీమియం చెల్లింపుపై విధివిధానాల ఖరారుకు కమిటీ: ప్రస్తుతం అమల్లో ఉన్న ధాన్యం కొనుగోలు విధానంలోని లోపాలను సవరించి రైతులకు సులువైన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కేబినెట్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న క్రాఫ్ ఇన్సూరెన్స్ చట్టాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఆర్థిక, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ మంత్రులు ముగ్గురితో కూడిన ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నెల రోజుల్లో నివేదికను ఇవ్వాల్సిందిగా ఆ కమిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అలాగే, కౌలు రైతులకు సులువుగా రుణాలు అందించే కొత్త విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని.. దీనిపై అధ్యయనం చేయాల్సిందిగా కేబినెట్‌కి ముఖ్యమంత్రి సూచించారు.

ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మక గుల్బెంకియన్ అవార్డు వచ్చింది. ఇది వ్యవసాయ రంగంలో నోబెల్ బహుమతితో సమానం. ఈ అవార్డు కింద రూ.9 కోట్లు వచ్చింది. ఈ ప్రకృతి సేద్యాన్ని 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ నేతృత్వంలో 5లక్షల హెక్టార్లతో ప్రారంభించగా.. 10 లక్షల మంది రైతులు భాగస్వాములు అయ్యారు. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా చేస్తున్న ఈ ప్రకృతి సేద్యం ప్రస్తుతం 4 రెట్లు పెరిగి 2029 నాటికి 20 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ప్రకృతి  సేద్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచి ఆదర్శప్రాయం అవుతుందని  ముఖ్యమంత్రి కేబినెట్‌కి తెలియజేశారు.

click me!