ప్రజలు ఛీకొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదు: గడ్డిపెట్టిన నారా లోకేశ్‌.. విజయసాయి రెడ్డి ఏమన్నారంటే?

Published : Jul 16, 2024, 04:45 PM IST
ప్రజలు ఛీకొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదు: గడ్డిపెట్టిన నారా లోకేశ్‌.. విజయసాయి రెడ్డి ఏమన్నారంటే?

సారాంశం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు విజయసాయి రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేగుతోంది. తాజాగా విజయసాయి రెడ్డి ప్రెస్‌మీట్‌లో వాడిన భాషపై ఏపీ మంత్రి నారా లోకేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు ఛీకొట్టినా ఇంకా బుద్ధి రాలేదన్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎంపీ విజయసాయి రెడ్డి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చుకునేందుకు మీడియా సమావేశం పెట్టిన విజయసాయి రెడ్డి.. మీడియా సంస్థలు, జర్నలిస్టులను దూషించారు. దేవదాయ శాఖ ఉద్యోగిణి వ్యవహారంపై వార్తలు చూపించడమే తప్పన్నట్లుగా ఆయా మీడియా సంస్థలను, జర్నలిస్టులను తనదైన భాషలో తిట్టిపోశారు. ప్రెస్‌ మీట్‌లో ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులను ‘‘అరే.. ఒరే.. అదు కాదురా..’’ అంటూ మాట్లాడారు. నోటికి వచ్చిన భాషంతా మాట్లాడి తూలనాడారు. 

ఈనాడు రామోజీరావునే ఏడాది పాటు వేధించాను.. ఏం చేశాడు? అంటూ తన ఘనత చాటుకునే ప్రయత్నం చేశారు విజయసాయి రెడ్డి. అలాగే, తనపై వార్తలు ప్రసారం చేసిన వారందరి అంతూ చూస్తానని హెచ్చరించారు. కొన్ని న్యూస్ చానళ్ల యజమానులను, వాటిలో డిబేట్లు నిర్వహించేవారిని కూడా పేర్లు పెట్టి దూషించారు. వా‌రి అంతు చూస్తానంటూ సవాల్ చేశా‌రు. చివరికి జర్నలిస్టుల పుట్టుకలపైనా కామెంట్లు చేశారు. 

ఈ వ్యాఖ్యలపై ప్రధాన మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో వ్యతరేకత వ్యక్తమవుతోంది. విజయసాయి రెడ్డి దూషించి సంస్థల ప్రతినిధులు, జర్నలిస్టు అయితే నేరుగా సవాల్ చేశారు ‘తేల్చుకుందాం రా’ అంటూ. ఇక సోషల్ మీడియాలో అయితే విజయసాయి రెడ్డిపై దారుణంగా ట్రోల్స్ మొదలయ్యాయి. ‘‘ఏ2గా 16 నెలలు జైలులో ఉండి వచ్చినోడికీ ఇంతకంటే మంచి భాష ఎలా ఉంటుంది?’’ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ‘‘రామోజీరావు ఏమి చేశారో తెలియదా విజయసాయిరెడ్డి..? మీ పార్టీ దారుణంగా పరాజయం పొంది, 11 సీట్లకే పరిమితమై, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పడిపోవడం చూస్తే అర్థం కావడం లేదా..? అక్రమ సంపాదనతో అహంకార తలకెక్కిన నీలాంటీ నోటిదూల మంత్రులు, ఎమ్మెల్యేల వల్ల కూడా మీ పార్టీ కొట్టుకు పోయిందనేది తమరు మరచిపోయినట్టున్నారు..!’’ అంటూ కొందరు జర్నలిస్టులు కామెంట్స్ చేస్తున్నారు. దేవాదాయ శాఖ ఉద్యోగిణి భర్త చేసిన ఆరోపణకు సరైన సమాధానం చెప్పకుండా మీడియాపై రంకెలేంటని ప్రశ్నిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రెస్ మీట్‌లో వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘‘విజయసాయి రెడ్డి గారు! మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్‌లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరం. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో  మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచీమర్యాదల గురించి చెప్పాల్సిన పనిలేదు. మీకు అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు. ఐదేళ్ల వైసీపీ పాలనలో మీ భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు ఛీకొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదు.’’ అంటూ నారా లోకేశ్‌ ట్వీట్ చేశారు.

 

దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి కూడా అంతే స్థాయిలో బదులిచ్చారు. ‘‘ నారా లోకేశ్, అతని కుల మాధ్యమాల్లో అధిక భాగం పాశ్చాత్య మీడియాలా పత్రికా స్వేచ్ఛను కోరుకుంటారు. కానీ ఉత్తర కొరియా మీడియాలా పనిచేస్తారు. ప్రజా ప్రతినిధులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారి ప్రాణాలను పణంగా పెట్టినా తమ రాజకీయ యజమానులకు లోబడి, తమ కుల ప్రయోజనాలను కాపాడుకుంటూ టీఆర్పీల వెనుకే నడుస్తున్నారు’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra Pradesh Legislative Council: తిరుమల నెయ్యి కల్తీ పైఅసెంబ్లీ లో రచ్చ రచ్చ | Asianet Telugu
CM Chandrababu Speech: ఏపీ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu