Andhra News: సెల్‌ ఫోన్ లైట్ల వెలుతురులో డెలివరీ.. నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణికి ప్రత్యక్ష నరకం

Published : Apr 07, 2022, 06:12 PM ISTUpdated : Apr 07, 2022, 06:18 PM IST
Andhra News: సెల్‌ ఫోన్ లైట్ల వెలుతురులో డెలివరీ.. నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణికి ప్రత్యక్ష నరకం

సారాంశం

ప్రభుత్వాలు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నాయి. ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో నిండు గర్భిణీకి డాకర్లు సెల్‌ ఫోన్ లైట్ల వెలుతురులో ఆపరేషన్ చేశారు. హృదయాన్ని ద్రవింపచేసే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో చోటుచేసుకుంది.

ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో నిండు గర్భిణీకి డాకర్లు సెల్‌ ఫోన్ లైట్ల వెలుతురులో ఆపరేషన్ చేశారు. హృదయాన్ని ద్రవింపచేసే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో చోటుచేసుకుంది. కరెంట్ కోతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్టుగా తెలుస్తోంది. వివరాలు.. ఏపీలో కొద్ది రోజులుగా భారీగా విద్యుత్ కోతలతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ ఆస్పత్రులలో కూడా విద్యుత్ కోతలతో పెషేంట్‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలింతలు, పసిపాపల బాధలు వర్ణనాతీతంగా మారాయి. 

కేడి పేటకు చెందిన గర్భిణి అనకాపపల్లిలోని నర్సీపట్నంలోని ఎన్టీఆర్‌ ప్రభుత్వాసుపత్రిలో చేరింది. గత రెండు రోజులుగా అక్కడ కరెంట్ కోతలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఆస్పత్రికి విద్యుత్ సరఫరా లేదు. మరోవైపు ఆసుపత్రిలో జెనరేటర్ పని చేయడం లేదు. దీంతో వైద్యులు బుధవారం రాత్రి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణీకి రాత్రి 11 గంటల సమయంలో సెల్‌ ఫోన్ లైట్ల వెలుగులో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ విజయవంతమై మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే చీకటిలో సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో ఆపరేషన్ చేయడం ద్వారా ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు మహిళా బంధువులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

గర్భిణి తల్లి మాట్లాడుతూ.. ప్రసవానికి కొవ్వొత్తులు, లైట్లు కావాలని రోగుల అటెండర్లను నర్సు కోరినట్టుగా చెప్పారు. దాదాపు రెండు మూడు గంటల నుంచి విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో ఆపరేషన్ చేశారని.. ఇలా చేయడం ద్వారా తన కూతురికి గానీ, శిశువుకు గానీ ఏదైనా జరిగితే ఎలా అని ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం తన భార్యను ఆస్పత్రిలో చేర్పించినట్టుగా మహిళ భర్త తెలిపారు.  అర్ధరాత్రి సమయంలో సిబ్బంది కొవ్వొత్తులు కావాలని అడిగారు.. ఆ సమయంలో అవి ఎక్కడ దొరుకుతాయని ప్రశ్నించారు.  చివరకు సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో ఆపరేషన్ చేశారని  చెప్పారు. మహిళ బంధువు ఒకరు మాట్లాడుతూ.. ‘‘ ఇది నరకంలా అనిపించింది. సాయంత్రం నుంచి కరెంటు లేదు. ఇలాంటి ఆసుపత్రిలో జనరేటర్ లేకపోతే పనులు ఎలా సాగుతాయి’’ అని ప్రశ్నించారు.

మరోవైపు  ప్రసూతి వార్డులో పరిస్థితి దారుణంగా ఉంది. కరెంట్ కోతలతో మహిళలు కొవ్వొత్తుల వెలుగులో పడుకోవాల్సి వచ్చింది. గత రెండు రోజులుగా నిత్యం కరెంటు కోతలు ఉంటున్నాయని ఆసుపత్రిలో రోగులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక, ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రుల్లో కూడా కరెట్ కోతలు ఉంటే పేషెంట్ల పరిస్థితి ఏమిటనే వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో కరెంట్ కోతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ఘటన తెలియజేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

ఆస్పత్రుల్లో కరెంట్ కోతలు.. పనిచేయని జనరేటర్లు..
జంగారెడ్డి గూడెం ఏరియా ఆస్పత్రిలో రాత్రి మొత్తం విద్యుత్ సరఫరాల నిలిచిపోయింది. దీంతో చంటి బిడ్డలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉక్కపోతతో అల్లాడిపోయారు. ప్రసూతి వార్డులో కరెంట్ లేకపోవడంపై బాలింతల బంధువులు ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించారు. అయితే జనరేటర్ నడిపేందుకు డీజిల్ లేదని వారు చెప్పారు. మరోవైపు చింతలపూడి సామాజిక ఆరోగ్య కేంద్రంలో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర అవస్తలు పడుతున్నారు. అవసరాన్ని బట్టి డిస్కమ్‌లు గ్రామీణ ప్రాంతాల్లో పగటిపూట 4 గంటల వరకు కరెంటు కోతలు విధిస్తున్నారు. ఇక, మున్సిపల్‌ ప్రాంతాల్లో రెండు గంటలపాటు విద్యుత్‌ కోత విధిస్తున్నారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో కరెంట్ కోతలు విధిస్తున్నారు. అయితే ఈ పవర్ కట్స్ చెబుతున్న సమయం కన్నా ఎక్కువగానే ఉంటున్నాయి. గ్రామాలు, పట్టణాల అన్న తేడా లేకుండా ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కొన్ని సమయాల్లో రాత్రిపూట కూడా కరెంటు కోతలు విధిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగన్ రాడు | JC Prabhakar Reddy Comments | Asianet News Telugu
Gade Sai Krishna Case: నేనెలాంటి సెటిల్మెంట్లు చేయలేదు | Janasena leader Ammisetty Vasu | Asianet