
అనంతపురం జిల్లాలో ఒక ఇంటర్ విద్యార్థిని హత్య కేసు ఏపీలో తీవ్ర సంచలనం రేపింది. రామకృష్ణ కాలనీకి చెందిన తన్మయి అనే యువతి ఈ నెల 3న ఇంటి నుంచి వెళ్లిన తర్వాత కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు వెంటనే వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది.ఈ క్రమంలోనే జూన్ 7న కూడేరు మండలంలోని గొట్కూరు వద్ద జాతీయ రహదారి పక్కన ముళ్ల పొదల్లో మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తన్మయి మృతదేహాన్ని గుర్తించారు. తలపై బలంగా కొట్టి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలోనే ఈ కేసులో అనుమానం ఉన్న ముగ్గురు యువకులను పోలీసులు ప్రశ్నించారు.వారిలో ఓ యువకుడు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తుంది.కానీ ప్రస్తుతానికి ఈ సమాచారాన్ని పోలీసులు బయటకు చెప్పలేదు. అయితే హత్య జరగడానికి ముందు జరిగిన సంఘటన అంటూ ఓ సీసీ టీవీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో షికారు చేస్తోంది.
ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ (Lokesh)స్పందిస్తూ తన్మయి హత్య పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దుండగులు మృతదేహాన్ని తగలబెట్టినందునా ఈ కేసు మరింత హృదయ విదారకంగా మారిందన్నారు. నిందితులకు కఠిన శిక్షలు తప్పవని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకి తావులేదు, ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తాం. హత్యకు గురైన సోదరి కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తాం' అంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (jagan)ఈ కేసుపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. తన్మయి హత్యపై పోలీస్ వ్యవస్థ విఫలమైందని, ఆరు రోజుల తర్వాతే మృతదేహం లభించడం దారుణమన్నారు. కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు 3నే ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించలేదని ఆయన మండిపడ్డారు.రాష్ట్రంలో మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం విఫలమైందని ట్వీట్ చేశారు.