
పేరుకే మిత్రపక్షాలైనా తెలుగుదేశంపార్టీ-భాజపాలది బలవంతపు కాపురం లాగే ఉంది. తాజాగా కమలం పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు అందుకు అద్దం పడుతున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు విషయంలో కన్నా తీవ్ర అసంతృప్తిని వెళ్ళగక్కారు. టిడిపితో పొత్తు ఒక్క వెంకయ్యనాయుడుకి మినహా ఇంకెవరికీ ఇష్టం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు వద్దని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతుండగా వెంకయ్య మాత్రమే పొత్తుండాలని పట్టుపడుతున్నట్లుగా చెప్పారు. అయితే, పొత్తు విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అని స్పష్టం చేసారు.
టిడిపితో పొత్తు విషయంలో పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్ళినట్లు కన్నా వెల్లడించారు. పొత్తులపై కమిటి వేసి నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా తమతో చెప్పారని అన్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు విషయంపై ఇటీవల బాగానే వార్తలు వస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఎన్నికల తర్వాత భాజపాతో పొత్తుండాలని చంద్రబాబునాయుడు అనుకుంటుండగా, టిడిపితో ఎట్టి పరిస్ధితుల్లోనూ పొత్తు వద్దని భాజపాలోని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే పొత్తు విషయం ఎప్పటికప్పుడు చర్చల్లో నానుతోంది. ఈ నెల 25వ తేదీన అమిత్ షా విజయవాడకు వస్తున్నారు. అందుకనే పొత్తుల విషయంపై చర్చలు మళ్ళీ ఊపందుకుంటోంది.