పార్లమెంటు సమావేశాల్లో తొలి రోజే తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఆమోదం పొందడం వెనక కుట్ర ఉందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు అన్నారు.
విజయవాడ : పార్లమెంటు సమావేశాల్లో తొలి రోజే తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఆమోదం పొందడం వెనక కుట్ర ఉందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ఇది కొత్త మలుపు అని ఆయన వ్యాఖ్యానించారు.
తమ పార్టీ అవిశ్వాసం నోటీసు ఇచ్చినప్పుడు ఎందుకు చర్చ జరపలేదని, ఎందుకు హెడ్ కౌంట్ చేయలేదని ఆయన నిలదీశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్షా, టీడీపీ రాజగురువుతో ఎందుకు చర్చలు జరిపారని, వాటి వెనుక ఉన్న రహష్యాన్ని బయటపెట్టాలని ఆయన బుధవారం మీడియా సమావేశంలో అన్నారు.
టీడీపీ, బీజేపీ మధ్య సయోధ్య కుదిరిందని, దానికి నేడు పార్లమెంట్లో జరిగిన సన్నివేశమే నిదర్శనమని అన్నారు. పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలపై ఎన్డీఏ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు నాయుడును నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లేననిరాంబాబు అన్నారు. ఢిల్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ పెద్ద డ్రామకు తెరలేపిందని విమర్శించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో టీడీపీ కేంద్రంపై అవిశ్వాసంపై ప్రగల్భాలు పలుకుతోందని అన్నారు.
కేంద్రంపై అందరికంటే ముందుగా అవిశ్వాస తీర్మానం పెట్టిన పార్టీ తమదేనని అన్నారు. ఎన్డీఏపై అవిశ్వాసం పెడితే విమర్శించిన చరిత్ర చంద్రబాబుదని ఆయన అన్నారు.,ఢిల్లీ వేదికగా మహాకుట్ర జరిగిందని, బీజేపీ, చంద్రబాబుల మధ్య లాలాచీ కుస్తీ జరిగిందని విమర్శించారు.
ఎప్పుడైనా తిరుమల కొండపై స్వామివారి ఆలయం మూసివేశారా అని ప్రశ్నించారు. ఆ తరువాత నిర్ణయం ఎందుకు పునఃసమీక్షించారని నిలదీశారు. దీనిపై ప్రభుత్వం, పాలకమండలి వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.