గవర్నర్-చంద్రబాబుకు చెడిందా ?

First Published Jan 10, 2018, 4:36 PM IST
Highlights
  • క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది.

చంద్రబాబునాయుడుకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర కు చెడిందా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన మూడున్నరేళ్ళల్లో గవర్నర్ ఏనాడు ఏపి ప్రయోజనాలకు మద్దతుగా నిలబడిన దాఖలాలు లేవు. ఇద్దరి మధ్య తాజాగా తలెత్తిన ఓ వివాదాన్ని గమనిస్తే ఇద్దరి మధ్య చెడిందన్న సంకేతాలే కనబడుతున్నాయి.

ఇంతకీ తాజా వివాదమేంటంటే? ‘నాలా’ బిల్లుపై గవర్నర్, ప్రభుత్వం మధ్య లేఖల యుద్దం మొదలైంది. నాలా బిల్లంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే చట్టం. (నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అసెస్మెంట్ యాక్ట్) 3 నెలల క్రితం నాలా బిల్లు ఆమోదానికి ప్రభుత్వం ఓ ఫైల్ ను గవర్నర్ కు పంపింది. అయితే, దానిపై ఏమీ మాట్లాడని గవర్నర్ కార్యాలయం ఈమధ్యనే ఫైల్ ను తిప్పిపంపింది. సరే, గవర్నర్ వద్ద నుండి తిరిగి వచ్చేసిన ఫైల్ ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ రూపంలో ఆమోదంప చేసుకుంది. అయితే, ఆ ఆర్డినెన్స్ కు కూడా గవర్నర్ ఆమోదం తప్పనిసరి.

అందుకని ఆర్డినెన్స్ ను ప్రభుత్వం గవర్నర్ కు పంపింది. అయితే, దానిపై సంతకం చేయకుండానే గవర్నర్ కార్యాలయం నుండి చంద్రబాబుకు లేఖ అందింది. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే, ప్రభుత్వం గతంలో చేసిన సూచనను పరిగణలోకి తీసుకోవటం లేదని లేఖలో గవర్నర్ కార్యాలయం స్పష్టంగా చెప్పింది. దాంతో ఆ లేఖపై ఏమి చేయాలో ఆలోచించాలంటూ చంద్రబాబు స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ కు పంపారు.

తాజా గొడవను పక్కనపెడితే ఏపి ప్రభుత్వం విషయంలో గవర్నర్ వైఖరిపై మొదటి నుండి అనుమానాస్పదంగానే ఉంది. రాష్ట్ర విభజన చట్టం కచ్చితంగా అమలయ్యేట్లు చూడాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉంది. కానీ గవర్నర్ వైఖరిపై మొదటి నుండి పలు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. మొదటి నుండి గవర్నర్ పాత్ర వివాదాస్పదంగానే ఉంది. గవర్నర్ వైఖరిపై స్వయంగా మంత్రులే బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి.

ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న గవర్నర్-చంద్రబాబుల వ్యవహారం ఇపుడిపుడే బయటపడుతోంది. అందుకు భారతీయ జనతా పార్టీ ఎంఎల్ఏల ఆరోపణలే నిదర్శనం. గవర్నర్ ఏనాడు నాలుగు రోజులు కూడా ఏపిలో వచ్చి ఉండలేదని భాజపా ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. గవర్నర్ వైఖరి మార్చుకోకపోతే కేంద్రంతో ఫిర్యాదు చేయాలని హెచ్చరికలు చేసే దాకా వ్యవహారం ముదిరిపోయింది. ఏం జరుగుతుందో చూడాలి.

 

 

 

 

  

click me!