
తిరుపతి : దొంగ ఓట్లపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఓ మహిళకు ఏకంగా 18 మంది భర్తలు ఉన్నట్టుగా ఓటరు జాబితాలో నమోదు చేయడం సిగ్గుచేటు అన్నారు.. దొంగ ఓట్ల నమోదుకు అనుమతి ఇచ్చిన అధికారులను బహిరంగంగా ఉరి తీసినా పాపంలేదని మండిపడ్డారు. పట్టభద్రుల ఎన్నికల్లో చదువు విషయంలో అర్హత కలిగిన వారికి ఓటుహక్కు కల్పించలేదని.. అర్హత లేని వారికి చోటు కల్పించారన్నారు. అలాంటి వారి పేర్లతో జాబితాను సిద్ధం చేశారని ఇది దారుణమైన విషయమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాను తిరుపతిలో బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న యశోద నగర్ లో ఓ దొంగ ఓట్ల విషయం విస్మయానికి గురిచేసింది. ఓ ఇంట్లో 30, వాలంటీర్ ఇంట్లో 12, మరో ఇంట్లో 8 దొంగ ఓట్లు ఉన్నాయంటూ నారాయణ తెలిపారు. దీని మీద ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్నిరోడ్డుమీద నిలబెట్టి సీఎం జగన్ అపహాస్యం చేస్తున్నారని అన్నారు. జగన్ అరాచక పాలనకు అంతేలేకుండా పోయిందని విమర్శించారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం .. సీఐడీ విచారణ వేగవంతం, నోయిడాలో సీమెన్స్ డైరెక్టర్ భాస్కర్ అరెస్ట్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకోవడంతోనే అధికార పార్టీ ఇలాంటి దొంగ ఓట్ల జాబితాకు తెరలేపిందని విమర్శించారు. ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయడానికి వచ్చే వారిని కాళ్లు విరగొట్టారని పిలుపునిచ్చారు. ఈ దొంగ ఓటర్ల జాబితాను.. అర్హత కలిగిన వారికి ఓటు హక్కు కల్పించకపోవడం మీద తాను న్యాయస్థానానికి వెళ్తానని.. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులే విజయం సాధిస్తారని.. ధీమా వ్యక్తం చేశారు.