తెలంగాణ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటాలన్నారు. నాణ్యమైన విత్తనాలే వ్యవసాయంలో అత్యంత కీలకమని చెప్పారు.
తెలంగాణలో అంతర్జాతీయ విత్తన పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాజేంద్ర నగర్ లో ఏర్పాటు చేసిన ఈ విత్తన పరీక్షా కేంద్రాన్ని.. తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. రూ.7వేల కోట్లతో 14,652 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితరులు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా.. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు..అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తన పరిశోధన, పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటాలన్నారు. నాణ్యమైన విత్తనాలే వ్యవసాయంలో అత్యంత కీలకమని చెప్పారు.
వ్యవసాయ అభివృద్ది, అధిక దిగుబడులకు విత్తనమే ప్రామాణికమని స్పష్టం చేశారు. ప్రపంచ విత్తన భాండాగారం తెలంగాణ అని ఎఫ్ఏవో వెల్లడించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మన కీర్తి పెరగడం తెలంగాణకు గర్వకారణం. హైదరాబాద్ను చూసి గర్వపడే పరిస్థితి సీఎం కేసీఆర్ కల్పించారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఐటీ రంగంలో తెలంగాణ ముందుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో రెండో స్థానానికి ఎదిగామన్నారు. విత్తన బాంఢాగారంగా ప్రపంచస్థాయిలో కీర్తి గడిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఒక్కొక్క రంగం అభివృద్ది ద్వారా హైదరాబాద్ ప్రపంచదృష్టిని ఆకర్షిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ, సాగు అనుకూల విధానాల మూలంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో విత్తన రంగం మీద దృష్టి సాధించడం జరుగుతున్నదని తెలిపారు. ప్రపంచంలో 70 నుంచి 80 దేశాలకు విత్తనాలు ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. విత్తనరంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలి. విత్తన దృవీకరణ, పరీక్షల ల్యాబ్ వినియోగం మరింత పెరుగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.