సింగపూర్‌లో అనుకోని ఘటన జరిగింది. భారీ జాక్‌పాట్ కొట్టేసిన వ్యక్తి అనుభవించకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయాడు. క్యాసినోలో భారీ మొత్తాన్ని గెలుచుకున్న సింగపూర్‌ వాసి.. అంతలోనే ప్రాణాలను కోల్పోయిన వింత ఘటన ఇది.

సింగపూర్‌లోని మెరీనా బే సాండ్స్ క్యాసినోలో జరిగిన ఘటన దిగ్భ్రాంతికరమైన మలుపు తీసుకుంది. ఈ క్యాసినోలో 4 మిలియన్‌ డాలర్లు గెలుచుకున్న వ్యక్తి... కొద్దిసేపటికే మరణించాడు. భారీ మొత్తంలో జాక్‌పాట్‌ తగిలిందన్న ఆనందాన్ని తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఒక్కసారిగా తట్టుకోలేనంత సంతోషం కలగడంతో కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైన వ్యక్తి.. అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. క్షణాల్లో జరిగిపోయిన ఈ ఘటన చూసి.. క్యాసినోలో ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. 

సింగపూర్‌లోని ప్రఖ్యాత మెరీనా బే సాండ్స్ క్యాసినోలో ఆనందకరమైన వాతావరణం మధ్య ఈ ఊహించిన ఈ సంఘటన జరిగింది. విజేత $4 మిలియన్ల జాక్‌పాట్‌ కొట్టడంతో అంతా వేడుకల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో వేడుకల మధ్య విజేత ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆనందమంతా ఆవిరిపోయింది. కార్డియాక్‌ అరెస్టుతో కుప్పకూలిన వ్యక్తిని బతికించేందుకు క్యాసినో సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 

 

ఈ ఘటనకు సంబధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే, ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. క్యాసినోలో వ్యక్తి కుప్పకూలిన వెంటనే సీపీఆర్ చేయాలని ఒక్కరు కూడా ప్రయత్నించలేదని కొందరు... సీపీఆర్‌ చేసి ఉంటే బతికేవాడని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. కాదు, విష ప్రయోగం జరిగి ఉంటుందని మరికొందరు అనుమానం వ్యక్తం చేశారు.