ఇది బెంగాల్ యొక్క విజయమని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమత బెనర్జీ చెప్పారు.
కోల్కత్తా: ఇది బెంగాల్ యొక్క విజయమని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమత బెనర్జీ చెప్పారు. ఆదివారం నాడు ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె కోల్కత్తాలో తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. మీరంతా పార్టీ విజయం కోసం కష్టపడ్డారు. పార్టీ విజయం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు సీఎం. మీడియా సమావేశానికి వీల్ఛైర్ లో కాకండా నడుచుకొంటూ ఆమె వచ్చారు. నందిగ్రామ్ లో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన సమయంలో ఆమె కాలికి గాయమైంది. తనపై బీజేపీ దాడికి దిగిందని మమత బెనర్జీ ఆరోపించారు. ఈ ఘటన ఈ ఏడాది మార్చి 10న చోటు చేసుకొంది. అప్పటి నుండి ఆమె ఎన్నికల ప్రచారాన్ని కూడ వీల్ చైర్ లోనే నిర్వహించారు.
also read:నందిగ్రామ్: నాడు లెఫ్ట్ప్రంట్కు, నేడు సువేంద్పై మమత దెబ్బ
ఇండ్లకు వెళ్లాలని ఆమె పార్టీ కార్యకర్తలకు సూచించారు.అంతేకాదు గుంపులుగా ఉండొద్దని ఆమె కోరారు. భౌతిక దూరం పాటించాలన్నారు. బెంగాల్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది. 50 రోజుల్లో 31 ర్యాలీల్లో ప్రధాని మోడీ, అమిత్ షా పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో కోవిడ్ ప్రోటోకాల్స్ ను ఉల్లంఘించారనే విమర్శలు కూడ పెద్ద ఎత్తున చోటు చేసుకొన్నాయి. ఎన్నికల ప్రచారంలో బీజేపీ, టీఎంసీ నేతల మధ్య వ్యక్తిగత దూషణలు కూడ చోటు చేసుకొన్నాయి.నందిగ్రామ్ లో సువేంద్ అధికారి, మమత బెనర్జీ మధ్య విజయం దోబుచూలాడింది. చివరికి విజయం మమతను వరించింది. బెంగాల్ లోని 20 ఎంపీ స్థానాల్లో 2019 లో 18 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంది. బెంగాల్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.శనివారం నాడు బెంగాల్ లో ఒక్కరోజులోనే 17,500 కేసులు నమోదు కాగా, 103 మంది మరణించారు. ఏప్రిల్ 30 నుండి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పాక్షిక లాక్ డౌన్ అమల్లో ఉంది.