బెంగాల్ ఎన్నికలు: రేపు నందిగ్రామ్‌లో పోలింగ్.. అలర్టయిన ఈసీ, కట్టుదిట్టమైన ఏర్పాట్లు

By Siva KodatiFirst Published Mar 31, 2021, 4:48 PM IST
Highlights

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న నందిగ్రామ్‌లో రేపు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో భాగంగా నందిగ్రామ్‌తో  పాటు 30 నియోజకవర్గాల్లో గురువారం ఓటింగ్ జరగనుంది. 

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న నందిగ్రామ్‌లో రేపు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో భాగంగా నందిగ్రామ్‌తో  పాటు 30 నియోజకవర్గాల్లో గురువారం ఓటింగ్ జరగనుంది.

కొవిడ్‌ నిబంధనలకనుగుణంగా పోలింగ్‌ ప్రక్రియ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. రెండో విడతలో ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలన్నీ దక్షిణ 24పరగణాస్‌, బంకురా, మేదినాపూర్‌ జిల్లాల పరిధిలో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా అందరిచూపూ నందిగ్రామ్‌పైనే నెలకొంది.   

తృణమూల్‌ కాంగ్రెస్ తరఫున సీఎం మమతా బెనర్జీ, గతంలో ఆమెకు ప్రధాన అనుచరుడిగా వుండి బీజేపీలో చేరిన సువేందు అధికారిలు నందిగ్రామ్‌లో తలపడటంతో ఇక్కడ ఎన్నిక రసవత్తరంగా మారింది.

మమత తన సిట్టింగ్‌ స్థానాన్ని వదులుకొని ఈసారి నందిగ్రామ్‌ నుంచి పోటీచేయడం.. అలాగే, ఆ ప్రాంత రాజకీయాలను శాసించే కుటుంబానికి చెందిన సువేందు అధికారి బీజేపీ తరఫున బరిలో నిలవడంతో ఇక్కడ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.

నందిగ్రామ్‌లో దీదీని ఓడించాలన్న పట్టుదలతో బీజేపీ తీవ్రంగా శ్రమించగా.. ఎలాగైనా గెలిచి సువేందుకు షాక్ ఇవ్వాలని మమత వ్యూహాలు రచిస్తున్నారు. నందిగ్రామ్‌లో ఇప్పటివరకు వామపక్షాలు ఎనిమిది సార్లు గెలవగా.. తృణమూల్‌ మూడు పర్యాయాలు విజయం సాధించింది.

ఈ నియోజవర్గంలో ఎలాంటి ఉద్రిక్తతలు ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ విధించారు. హెలికాఫ్టర్లతో నిఘా వుంచారు. రెండో విడత ఎన్నికలు జరగనున్న 30 నియోజకవర్గాల్లో మొత్తం 171 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 152మంది పురుషులు కాగా 19 మంది మహిళా అభ్యర్థులు. 

click me!