దిశ ఘటనపై అసెంబ్లీలో జగన్ కామెంట్స్... బుద్దా వెంకన్న సెటైర్లు

By Arun Kumar PFirst Published Dec 10, 2019, 7:14 PM IST
Highlights

మహిళా రక్షణపై ప్రగల్బాలు పలుకుతూ ఏపి సీఎం జగన్ దిశ ఘటనపై కనీస అవగాహన లేకుండా మాట్లాడారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. 

హైదరాబాద్ లో చోటుచేసుకున్న దిశ ఘటన యావత్ దేశాన్ని కలచివేసిందని... అయితే ఆడపిల్లల తండ్రినయిన తనను మరింత బాధించిందని ఇటీవల అసెంబ్లీలో ఏపి సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేసిన తెలిసిందే. అయితే ఈ సమయంలో జగన్ మహిళా రక్షణ, దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తదితర అంశాలపై చేసిన ప్రసంగాన్ని టిడిపి తప్పుబడుతోంది. ఈ  ఘటనపై ఆయన కనీస అవగాహన లేకుండా మాట్లాడారంటూ టిడిపి ఎమ్మెల్సీ  బుద్దా వెంకన్న ఆరోపించారు.  

''దేశాన్ని కుదిపేసిన దిశ ఘటన గురించి కనీస అవగాహన లేకుండా వైఎస్ జగన్ అసెంబ్లీలో మాట్లాడటం చూసి మహిళల భద్రతపై వైకాపా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో రాష్ట్రంలో ఉన్న మహిళలకు అర్థం అయ్యింది. 70% నేరచరిత్ర ఉన్న నాయకులు దేశంలో ఒక్క వైకాపానే అని సర్వే రిపోర్టులు బయటపెట్టాయి.''

''ఆరు నెలల వైకాపా పాలనలో 30 మంది మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరిగాయి. ఒక్క మహిళకైనా న్యాయం జరిగిందా? ఒక్క మృగాడికైనా శిక్ష పడిందా? స్వయంగా వైకాపా కార్యకర్తలు నాయకులే కొన్ని కేసుల్లో నిందితులుగా ఉన్నారు.''

''జగన్ గారికి చిత్తశుద్ధి ఉంటే వారికి శిక్ష విధించాలి. రేప్ కేసు ఉన్న వ్యక్తికి ఎంపీ సీటు, వరకట్న వేధింపుల కేసు ఉన్న వ్యక్తికి ఎంపీ సీటు,మహిళలను వేధించిన 5గురికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన జగన్ గారు, ఎంపీ విజయసాయిరెడ్డి గారు, మహిళలకు రక్షణ కల్పిస్తాం అని మాట్లాడటం చూస్తే చాలా వింతగా ఉంది'' అంటూ బుద్దా వెంకన్న ద్వజమెత్తారు. 

read more  తెలుగుదేశం హయాంలో కంపెనీలు మూతపడ్డాయి...అయినా...: టిడిపి మాజీ ఎమ్మెల్యే

అంతకుముందు కూడా మహిళా రక్షణపై సీఎం జగన్ చేసిన కామెంట్స్ పై బుద్దా ఘాటుగా స్పందించాడు. ''ఎంపీ విజయసాయి రెడ్డి గారిని చూస్తేఉట్టికి ఎగ‌ర‌లేన‌మ్మ ఆకాశానికి ఎగిరింది అనే పాత సామెత గుర్తొస్తోంది. రాష్ట్రంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించలేని మీరు, తెలంగాణ లో జరిగిన ఘటన గురించి మాట్లాడటం విడ్డురంగా ఉంది. రేప్ కేసు, వర కట్న కేసులో ఉన్న వ్యక్తులకు సీట్లు ఇచ్చిన పార్టీ మీది.''

''70 శాతం నేర చరిత్ర ఉన్న వ్యక్తులను మన పార్టీలో పెట్టుకుని లెక్చర్లు ఇవ్వడం సిగ్గుగా లేదా? 6నెలల మీ పాలనలో రాష్ట్రంలో 20 మంది మహిళల పై అత్యాచార, వేధింపుల ఘటనలు జరిగాయి.   వైఎస్ జగన్ గారు అధికారంలోకి రాగానే వైకాపా కార్యకర్తలు ఒంగోలు లో మైనర్ బాలిక పై చేసిన అత్యాచార ఘటన మర్చిపోయారా?'' 

''బ్లూ మీడియాని అడ్డం పెట్టుకొని అత్యాచార ఘటనలు బయటకు రాకుండా మీరు, జగన్ రెడ్డి మ్యానేజ్ చేసినంత మాత్రానా నిజాలు దాగవు. రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న అకృత్యాలు, వాటి వెనుక ఉన్న వైకాపా నాయకుల పేర్లు ఎప్పటికప్పుడూ బయట పెడుతూనే ఉంటా విజయసాయి రెడ్డి గారు''  అంటూ ద్వజమెత్తారు.

read more ఉల్లి కొరతపై జగన్ సంచలన నిర్ణయం...బోర్డర్లు సీజ్‌: మంత్రి కన్నబాబు
 
 
 
 

click me!