దగా, మోసం కలగలిస్తే జగన్‌లా మారుతుంది: దేవినేని ఉమ

By Arun Kumar PFirst Published Oct 15, 2019, 6:06 PM IST
Highlights

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన రైతుబంధు పథకం పై మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు కురిపించారు.  

విజయవాడ:  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను తుంగలోతొక్కారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఒకొక్క రైతుకు లక్షా ఇరవైవేల రూపాయలను మా ప్రభుత్వం రుణమాఫీ చేసిందని గుర్తుచేశారు. ఇందుకోసం జిఓ నెం 38 ద్వారా బాండ్లు ఇచ్చామన్నారు. 

అయితే ఈ ప్రభుత్వం జిఓ నంబరు 99 ద్వారా రద్దు చేస్తామంటోంది. రుణమాఫీ డబ్బులు రానివారు దురదృష్టవంతులా అని ప్రశ్నించారు. రైతుల అక్కౌంట్లలో డబ్బులు పడనివ్వకుండా రూ. 7800 కోట్లు రైతులకు నష్టం చేసారని తెలిపారు. 

ముఖ్యమంత్రి నుంచి అధికారుల వరకూ రైతు భరోసాపై తలో లెక్క చెపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ముఫ్ఫై లక్షలకు  పైగా రైతుల ఖాతాలు భరోసాకు  తిరస్కరించబడ్డాయన్నారు. అలాగే పదిహేను లక్షలకు పైగా కౌలు రైతులు ఉంటే, సిఎంకు మూడు లక్షలే కనిపించారా..? అని ప్రశ్నించారు. 

అన్నదాత సుఖీభవ పథకంలో రైతులు పొందే లబ్ధిని రద్దు చేశారని గుర్తుచేశారు. అలాగే  రైతు భరోసా పదిహేను విడతలు చేసి మోసం చేస్తున్నారు.దగా, మోసం కలిపితే జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు.  

ప్రభుత్వం మొదటి విడతలో రైతుకు ఇచ్చిన సొమ్మును బ్యాంకులో పడకుండా చేశారన్నారు. వ్యవసాయశాఖలో ఇద్దరు క్యాబినెట్ మంత్రులను పెట్టిన జగన్, పరిపాలన ఎలా ఉందో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. 

సోమశిల, కందలేరు ప్రాజెక్టులలో 150టిఎంసిలు నీళ్ళు నిలబెడితే, ఇప్పుడు వదిలేశారన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఉత్తరాలకు జగన్ ఎందుకు సమాధానం చెప్పట్లేదని ఉమ ప్రశ్నించారు. 

సంవత్సరంలో పూర్తయ్యే పోలవరం ప్రాజెక్టును, ఐదు సంవత్సరాలకు పెంచారు.  మొత్తం నెల్లూరు జిల్లాలో నీటి వనరులు టిడిపి అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన సొంత డబ్బా కొట్టుకుంటున్నారని అన్నారు. 

79లక్షల 50వేల 844 రైతు భరోసాలు సాధికారత సర్వేలో, భూసర్వేలో, ఆధార్ డేటలో ఉన్నాయా..?  అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను గ్రామ వాలంటీర్లుగా పెట్టుకున్నారన్నారు. 

వైసిపి చేసే రైతు వ్యతిరేక కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. జీరో వడ్డీ అమలు జరిగిందా? వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ధరల స్ధిరీకరణతో టమాటా రైతు పరిస్ధితి ఏమిటని ప్రశ్నించారు. నాలుగు నెలల్లో 129మంది రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

click me!