వూళ్లలోకి రానివ్వలేదు.. చెబితే వినలేదు: ల్యాండ్‌పూలింగ్‌పై సీపీఎం మధు వ్యాఖ్యలు

By sivanagaprasad KodatiFirst Published Jan 5, 2020, 5:26 PM IST
Highlights

ల్యాండ్ పూలింగ్ ద్వారా కాకుండా భూ సేకరణ విధానం ద్వారా రాజధానికి భూమిని సేకరించి ఉంటే రైతులకు న్యాయం జరిగేదన్నారు సీపీఎం ఏపీ కార్యదర్శి మధు.

ల్యాండ్ పూలింగ్ ద్వారా కాకుండా భూ సేకరణ విధానం ద్వారా రాజధానికి భూమిని సేకరించి ఉంటే రైతులకు న్యాయం జరిగేదన్నారు సీపీఎం ఏపీ కార్యదర్శి మధు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ... ల్యాండ్ పూలింగ్ విధానం తప్పు అని తాము గతంలోనే చెప్పామని, అపుడు మమ్మల్ని రైతులు గ్రామాల్లోకి రానివ్వలేదని మధు గుర్తుచేశారు.

రైతులతో ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని.. ప్రభుత్వం రైతులతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగితే ప్రభుత్వం ఎందుకు ఇంతవరకు బయటపెట్టలేదని మధు ప్రశ్నించారు.

సచివాలయం విశాఖపట్నం తరలించడం ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్‌ విధానంలో భూములు ఇవ్వనివారిని వేధించిందని.. జగన్ సర్కార్ భూములు ఇచ్చిన వారిని వేధిస్తోందని మధు మండిపడ్డారు. రైతులకు సీపీఎం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. 

Also Read:మూడు రాజధానులు.. జగన్‌కు టీఆర్ఎస్ నేతల ఫోన్లు: సీపీఐ నారాయణ

అంతకుముందు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ఏపీ రాజధానిని మూడు ముక్కలుగా ప్రకటించిన వెంటనే  హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వెంచర్ల రేట్లు పెరిగాయన్నారు.  ఆదివారం విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్‌లో అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన నిరసన దీక్షకు నారాయణ మద్ధతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మూడు రాజధానుల ప్రకటన అనంతరం జగన్ కు తెలంగాణ నుంచి టీఆర్ఎస్ నేతలు ధన్యవాదాలు చెప్పారన్నారు. తెలంగాణ కోసం జగన్ సేవ చేస్తున్నారు తప్ప ఆంధ్రవాళ్ల కోసం కాదని నారాయణ ఎద్దేవా చేశారు.

రాజధానిని మార్చుతానని మేనిఫెస్టేలో జగన్ ఎందుకు పెట్టలేదో చెప్పాలని నారాయణ ప్రశ్నించారు. ప్రజల తీర్పు లేకుండా రాజధానిని మార్చే నైతిక హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ సహా ఎమ్మెల్యేలంతా వెంటనే  రాజీనామా చేసి.. రాజధానిని మార్చుతామనే ఎజెండాతో ఎన్నికలకు వెళ్లి గెలవాలని నారాయణ సవాల్ విసిరారు.

Also Read:వారికి ఆడి కార్లు, బంగారు గాజులు ఎలా వచ్చాయి.. అదంతా వాళ్ళ పనే: పృథ్వీ

రాజీనామా చేసి తిరిగి గెలిచి అప్పుడు మూడు రాజధానుల పై నిర్ణయం తీసుకోవాలని దుయ్యబట్టారు. సెక్రటేరియట్ , అసెంబ్లీది  భార్యా భర్తల సంబంధమని రెండూ ఒకేచోట ఉండాలని నారాయణ హితవు పలికారు.

కమిటీలోని వాళ్లంతా ఖాళీ కాగితాలను జగన్ కిస్తే ఆయన విజయసాయిరెడ్డితో నివేదిక రాయించారని ఆయన ఆరోపించారు. రాజధానిపై వేసిన కమిటీల నివేదికలు నాలుక గీసుకునేందుకు కూడా పనికిరావని ధ్వజమెత్తారు.

పిచ్చాసుపత్రుల నుంచి వచ్చిన వారే కమిటీ లో ఉన్నారని అది మెంటల్ కమిటీ అంటూ ఫైరయ్యారు. అమరావతి ఆంధ్రుల హక్కు అనే నినాదం రావాలని.. రాజధాని కోసం చేసే పోరాటానికి కమ్యునిస్టు పార్టీ అండగా ఉంటుందని నారాయణ హామీ ఇచ్చారు. 

click me!