కోటంరెడ్డిపై వైసిపి వేటు... ఏడాదిముందే నెల్లూరు రూరల్ అభ్యర్థిని ప్రకటించిన సజ్జల

Feb 3, 2023, 10:19 AM IST

అమరావతి : సొంత పార్టీ, ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తూ వైసిపిని వీడేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సిద్దమైన విషయం తెలిసిందే. అయితే ఆయన పార్టీని వీడకముందే వైసిపి అదిష్టానం అప్రమత్తమయ్యింది. నెల్లూరు రూరల్ అసెంబ్లీ సమన్వయకర్తగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమిస్తూ వైసిపి అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుండి వైసిపి అభ్యర్ధిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.  

తనకు నెల్లూరు రూరల్ అసెంబ్లీ బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ కు ఆదాల కృతజ్ఞతలు తెలిపారు. తమ నాయకుడు జగన్ నమ్మకాన్ని నిలబెట్టి నెల్లూరు రూరల్ లో వైసిపిని అత్యంత మెజారిటీతో గెలిపిస్తానని ఆదాల అన్నారు.