ఐపీఎల్‌.. యువ క్రికెటర్లకు అద్భుతమైన వేదిక అని మరోసారి రుజువైంది. టీమ్‌ఇండియాకు ఆడుతోన్న చాలామంది కుర్రాళ్లు ఈ లీగ్‌లోనే మెరిసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ఈ జాబితాలోకి మరో యువ స్పిన్నర్ విఘ్నేశ్‌ పుతుర్ (Vignesh Puthur) చేరాడు. తొలిసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఈ కుర్రాడు నాణ్యమైన ప్రదర్శనతో దిగ్గజం ఎంఎస్ ధోనీ నుంచి మెప్పు పొందడం విశేషం. ముంబయి తరఫున బరిలోకి దిగిన విఘ్నేశ్‌ నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. స్పిన్‌ బౌలింగ్‌ను దంచేసే దీపక్ హుడా, శివమ్‌ దూబెను ఔట్ చేశాడు. దూకుడుగా ఆడిన రుతురాజ్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. రోహిత్‌కు బదులు ఇంపాక్ట్‌గా వచ్చి సత్తా చాటాడు. మరి ఇలాంటి ప్రదర్శన చేసిన విఘ్నేశ్‌ చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరాడంటే అద్భుతమనే చెప్పాలి.