చిలకలూరిపేట బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం... తల్లిదండ్రుల చెంతకు చేరిన చిన్నారి

Oct 3, 2022, 2:01 PM IST

పల్నాడు జిల్లా చిలకలూరిపేట బాలుడి కిడ్నాప్ ఘటన సుఖాంతమయ్యింది. కిడ్నాపర్లు బాలున్ని నెల్లూరు జిల్లా కావలి వద్ద కారులో వదిలి పరారయ్యారు. స్థానికులు బాలున్ని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. ఈ బాలుడు చిలకలూరిపేటలో కిడ్నాప్ కు గురయిన రాజీవ్ సాయిగా గుర్తించారు. దీంతో చిలకలూరిపేట పోలీసులకు సమాచారమిచ్చి నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు. అక్కడ తల్లిదండ్రులకు బాలున్ని అప్పగించారు. 

చిలకలూరిపేటలోని 13వ వార్డులోని ఓ దేవాలయంలో తల్లిదండ్రులు పూజలు చేస్తుండగా బయట ఆడుకుంటున్న రాజీవ్ సాయిని దుండగులు కిడ్నాప్ చేసారు. తర్వాత బాలుడి తల్లిదండ్రులకు పోన్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేసారు. దీంతో బాలుడి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. అయితే కేవలం గంటల వ్యవధిలోనే బాలుడు కిడ్నాపర్ల చెరనుండి బయటపడి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు.