
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఎన్నికల హామీలు నెరవేర్చితే.. మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలపాలని సవాలు విసిరారు. ఈ మేరకు వైఎస్ షర్మిల ట్విట్టర్లలో ఆదివారం పోస్టు చేశారు. కేసీఆర్ ఉద్యమ సెంటిమెంట్తో మొదటిసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారని, రెండోసారి తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో కుర్చీని కాపాడుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో తొమ్మిదేళ్లు అవినీతి ఏరులై పారించి.. ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టారని ఆరోపించారు.
ఆయన కుటుంబానికి పదవులు కట్టబెట్టి, ఉద్యమ ద్రోహులను నెత్తిన పెట్టుకున్నారని విమర్శలు గుప్పించారు. ఇన్నాళ్లు ‘‘దొర గారు’’(కేసీఆర్) దర్జాగా గడీల్లో ఉంటే.. ఎమ్మెల్యేలు బందిపోట్ల లెక్క ప్రజల మీద పడి దోచుకున్నారని ఆరోపించారు. కబ్జాలకు,అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, ప్రశ్నించిన వాళ్లను చితకబాదారని, ఎన్నికలొచ్చే సరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై జనం గుర్రుగా ఉన్నారని తెలుసుకున్న కేసీఆర్ ఉలిక్కిపడుతున్నారని విమర్శించారు.
సిట్టింగులకు సీట్లు అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే.. సర్వేల పేరుతో కేసీఆర్ హడావిడి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలను మారిస్తే తప్ప గట్టెక్కలేనని కేసీఆర్ తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన.. అవినీతిరహిత పాలనే అయితే, హామీలు నెరవేర్చి ఎన్నికల మేనిఫెస్టోకి న్యాయం చేసిన వారే అయితే, మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలవండి’’ అని షర్మిల సవాలు చేశారు. ‘‘ఎన్నికల్లో గెలిచి మీ మీ పాలనకు ఇది రెఫరెండం అని ప్రూవ్ చేయండి’’ అని షర్మిల పేర్కొన్నారు. కేసీఆర్కు దమ్ముంటే ఈ సవాలును స్వీకరించాలని అన్నారు.