
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని వార్తలు జోరుగా వస్తున్నాయి. ఆమె రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినా.. దీని వెనుక మర్మం పార్టీ విలీనమే అనే గుసగుసలు వినిపించాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలూ ఈ వదంతులపై స్పందించి వైఎస్సార్టీపీ విలీనానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తొలిసారి స్వయంగా స్పందించారు.
ట్విట్టర్ వేదికగా ఆమె ఈ వదంతుల సందర్భంలో ఓ ట్వీట్ చేశారు. వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరు తెలంగాణ బిడ్డగా.. తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటారని ఆమె పేర్కొన్నారు. అంతేకానీ, ఊహాజనిత కథనలు కల్పిస్తూ, ఆమెకు, తెలంగాణ ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించే విఫల ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
Also Read: పార్టీ మారుతామనే వాళ్లను ఆపబోం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
అంతేకాదు, పని లేని, పస లేని దార్శనికులు అని పేర్కొంటూ.. తన రాజకీయ భవిష్యత్ మీద దృష్టి పెట్టే బదులు.. కేసీఆర్ పాలనలో నాశనమైపోతున్న తెలంగాణ భవిత మీద దృష్టి పెట్టాలని సూచించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిని ఎండగట్టాలని పేర్కొన్నారు. తన భవిష్యత్ తెలంగాణతోనే అని, తన ఆరాటం, తన పోరాటం తెలంగాణ కోసమే అని.. జై తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు.
ఇంత ట్వీట్ చేసినా.. ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే విషయంపై నేరుగా స్పష్టత ఇవ్వలేదు. ఇంతకీ ఈ పార్టీ విలీనం మాట అవాస్తవమేనా? లేక భవిష్యత్లో జరుగుతుందా? అనేది స్పష్టంగా చెప్పలేదు. కానీ, ఆమె విలీనం ఒక కట్టుకథ అని, దుష్ప్రచారం అని చెప్పే ప్రయత్నం చేసిందనే అభిప్రాయాలు వస్తున్నాయి.