
హైదరాబాద్:తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయకపోవడంపై నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు.తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో వైఎస్ షర్మిల గురువారంనాడు ఇందిరాపార్క్ వద్ద దీక్షను ప్రారంభించారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.95 లక్షల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో ఆమె ఈ దీక్షను ప్రారంభించారు.తెలంగాణలో సుమారు 40 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని ఆమె చెప్పారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేయని కారణంగా మనోవేదనకు గురైన అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంత మంది ఆత్మహత్యలు చేసుకొన్నా కేసీఆర్ లో ఎందుకు చలనం కలగడం లేదని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ ఛాతీలో గుండె ఉందా బండరాయి ఉందా అని ఆమె అడిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సునీల్ సిరిసిల్లకు చెందిన మహేందర్ యాదవ్, నల్గొండకు చెందిన సంతోష్ కుమార్ ఆత్మహత్యలను ఆమె ప్రస్తావించారు.
ఏ పార్టీ, ఏ నాయకుడు పోరాటం చేసినా చేయకున్నా తాము నిరుద్యోగుల తరపున తాము పోరాటం చేస్తామని ఆమె ప్రకటించారు. తాను ముందుగా ప్రకటించినట్టుగా 72 గంటల పాటు దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు.తన 72 గంటల దీక్ష పూర్తైన తర్వాత నిరుద్యోగులకు మద్దతుగా జిల్లాల్లో తమ పార్టీకి చెందిన కార్యకర్తలు దీక్షలు చేస్తారని ఆమె తెలిపారు. మూడు రోజులపాటు దీక్షకు అనుమతి ఇవ్వాలని షర్మిల పోలీసులను కోరింది. అయితే ఇవాళ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దీక్షకు పోలీసులు అనుమతి ఇచ్చారు.