
YS Sharmila: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి మోడీ, కేసీఆర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలను సంధించారు. రాష్ట్రానికి కేసీఆర్, దేశానికి మోడీ చేసింది ఏం లేదని ఏద్దేవా చేసింది. ఈ మేరకు షర్మిల తన ట్విట్టర్లో.. ''మోదీ, కేసీఆర్ లు ఇద్దరూ ఒకే తాను ముక్కలు. మోదీ రాష్ట్రానికి ఇచ్చింది ఏమీలేదు, కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నది లేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న మోదీ గారు ఉద్యోగాలు ఇచ్చింది లేదు కానీ, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుండు.
ఇక ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ గారు ఉన్న ఉద్యోగులను పీకేస్తూ, నిరుద్యోగులు చచ్చేలా చేస్తున్నారు. మోదీ తెలంగాణకు అన్యాయం చేసి మహారాష్ట్రపై ప్రేమ కురిపించి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే తెలంగాణకు రైల్వే ఫ్యాక్టరీ సాధించడంలో కేసీఆర్ కొట్లాడింది లేదు. మోదీ కేంద్ర విద్యాసంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేసింది లేదు.
కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య అందించింది లేదు. రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారని నువ్వు దొంగ అంటే నువ్వే దొంగ అన్నట్లు .. TRS, BJPలు లేఖాస్త్రాల డ్రామాలకు తెరలేపాయి తప్ప తెలంగాణకు కేసీఆర్, మోదీలు చేసింది ఏమీ లేదు. దొందు దొందే.. ఇద్దరూ దొంగలే'' అని షర్మిల విమర్శలు గుప్పించింది.