సెట్ చేసుకుందాం, కలిసి పనిచేద్దాం : కీలక నేతకు వైఎస్ జగన్ పిలుపు

By Nagaraju penumalaFirst Published Mar 7, 2019, 9:26 AM IST
Highlights

వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ కు, వైఎస్ జగన్ కు నెలకొన్న విబేధాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం జగన్ కు నోటీసులు జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ సస్పెన్షన్ వేటుపై  మార్చి11లోపు సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ శివకుమార్ కు స్నేహ హస్తం అందించారని తెలుస్తోంది. 

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నెలకొన్న వివాదాలను చక్కదిద్దేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనదేనంటూ ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీపై ఎలాంటి విబేధాలు లేకుండా ఉండేందుకు వైఎస్  జగన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా కలిసి పనిచేద్దాం రావాలంటూ శివకుమార్ కు జగన్ తన సన్నిహితుల ద్వారా కబురుపంపారు. 

దీంతో గురువారం శివకుమార్ వైఎస్ జగన్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అంతా కలిసి పనిచెయ్యాలని, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చెయ్యాలని  జగన్ శివకుమార్ కు కబురుపంపినట్లు తెలుస్తోంది.    

ఇకపోతే వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ కు, వైఎస్ జగన్ కు నెలకొన్న విబేధాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం జగన్ కు నోటీసులు జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ సస్పెన్షన్ వేటుపై  మార్చి11లోపు సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ శివకుమార్ కు స్నేహ హస్తం అందించారని తెలుస్తోంది. 

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని అయిన శివకుమార్ 2009లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో శివకుమార్ ఆ పార్టీని వైఎస్ జగన్ కు అప్పగించారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా శివకుమార్ వ్యవహరిస్తున్నారు. పార్టీలో కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అయితే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని ప్రకటించారు శివకుమార్.

శివకుమార్ నిర్ణయంతో ఆగ్రహం చెందిన వైఎస్ జగన్ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీలో చర్చించకుండా శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం, పత్రికా ప్రకటన విడుదల చెయ్యడాన్ని ఖండిస్తూ ఆయనపై వేటు వేసినట్లు తెలిపారు. 

తన బహిష్కరణపై శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జనరల్ సెక్రటరీగా మద్దతు పలికానని అందులో తప్పేంటని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఒక పార్టీ వ్యవస్థాపకుడిని బహిష్కరించిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

తనపై విధించిన బహిష్కరణ వేటును ఎత్తివేయాలని లేనిపక్షంలో వైసీపీ నుంచి వైఎస్ జగన్ బయటకు పోవాలి అంటూ అల్టిమేటం జారీ చేశారు శివకుమార్. తాను పెట్టిన పార్టీ నుండి పొమ్మనటానికి మీరెవరు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత శివకుమార్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. 

తనపై బహిష్కరణ వేటును ఎత్తివేయకపోతే ఇందిరా పార్కు వద్ద నిరసన దీక్ష చేపడతానని కూడా వార్నింగ్ ఇచ్చారు. న్యాయపోరాటంలో భాగంగా ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం వైఎస్ జగన్ కు నోటీసులు జారీ చేసింది. తాజాగా వీరిద్దరూ రాజీకి రావడంతో పార్టీలో జోష్ నింపినట్లైంది. 


 

click me!