చెల్లిలితో ప్రేమ పెళ్లి.. యువకుడిపై దాడి

By ramya neerukondaFirst Published Oct 2, 2018, 10:02 AM IST
Highlights

ఇరువురూ ఇంటికి రాకుంటే మహేశ్‌ తల్లిని చంపివేస్తామని రేఖ కుటుంబ సభ్యులు బెరించారు. దీంతో ఇరువురూ స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలోనే నెల తిరగకుండానే ఇరువురి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి.

వరసకు చెల్లెలు వరస అయ్యే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  అది నచ్చని కుటుంబసభ్యులు అతనిని చితకబాదారు. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...మండలంలోని దుమాల గ్రామానికి చెందిన దుంపలపల్లి మహేశ్‌(23) అదే గ్రామానికి చెందిన సోమారపు రేఖ(21) ప్రేమించుకున్నారు. ఇద్దరు ఒకే కులానికి చెందిన వారు అయినప్పటికీ రేఖ మహేష్‌కు వరుసకు చెల్లెలు కావడం వల్ల వారి పెళ్లిని అమ్మాయి కుటుంబసభ్యులు నిరాకరించారు. దీంతో గతేడాది నవంబర్‌ 21న హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడే ఉంటున్నారు.

అయితే ఇరువురూ ఇంటికి రాకుంటే మహేశ్‌ తల్లిని చంపివేస్తామని రేఖ కుటుంబ సభ్యులు బెరించారు. దీంతో ఇరువురూ స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలోనే నెల తిరగకుండానే ఇరువురి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. గతేడాది డిసెంబర్‌ 9న పోలీస్‌స్టేషన్‌లో రెండువర్గాల వారు పంచాయితీ చేసుకున్నారు. మహేశ్‌ ఇకపై రేఖను కలువరాదని షరతులు పెట్టి పుట్టింటికి  తీసుకెళ్లారు. 

ఈ నేపథ్యంలో ఆదివారం కానిస్టేబుల్‌ పరీక్ష రాయడానికి రేఖ కరీంనగర్‌ వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్‌ ఆమెను వెంబడించి కొదురుపాక వద్ద కలిసి తనతో ఉండాలని ఒత్తిడి చేశాడు. యువతి ఇంటికి వెళ్లి మహేశ్‌  వెంటపడి వేధించాడని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో కోపోదిక్తులైన వారు మహేష్‌ ఇంటికి వెళ్లి దాడిచేసి తీవ్రంగా కొట్టారు. అడ్డుగా వెళ్లిన తల్లి బాలమణిని సైతం చితకబాదారు. పోలీసులు రంగంలోకి దిగి మహేశ్‌తో పాటు అతని తల్లిని చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌ తెలిపారు.

click me!