తీవ్ర మనస్థాపానికి గురైన ఖాద్రీ శనివారం ఇంట్లో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి వెళ్లగా.. కుటుంబసభ్యులు ఓవైసీ ఆసుపత్రికి తరలించారు.
సోషల్ మీడియాలో వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా జర్నలిస్ట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని డబీర్ పురాకు చెందిన ఎంబీటీ నేత సయ్యద్ సలీం(66) వేధిస్తున్నాడని.. మహిళా జర్నలిస్ట్ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆ తర్వాత నిద్రమాత్రలు మింగారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
గుల్షన్-ఏ-ఇక్బాల్ కాలనీకి చెందిన సయ్యదా నాహీదా ఖాద్రీ(37) ఓ న్యూస్ ఛానెల్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఎంబీటీ నేత సలీం కొద్దిరోజులుగా ఆమెపై అసభ్యకరమైన వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.
దీంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన ఖాద్రీ శనివారం ఇంట్లో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి వెళ్లగా.. కుటుంబసభ్యులు ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. తన తల్లి ఈ పరిస్థితికి సలీం కారణమని ఖాద్రీ కుమార్తె శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు మేరకు అతనిని అరెస్టు చేశారు. అనంతరం అతనిని రిమాండ్ కి తరలిస్తున్నట్లు తెలియడంతో వందల సంఖ్యలో మజ్లిస్ కార్యకర్తలు పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి దాడికి యత్నించారు. కాగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ వేధింపుల విషయమై ఖాద్రీ మే 25వ తేదీనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఇటీవల సలీం ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి మరీ ఆమెను దూషించారు. దీంతో.. తట్టుకోలేక సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు యత్నించారు.