
హైదరాబాద్ : తాను దైవదూతనని నమ్మిస్తూ.. కష్టాల్లో ఉన్న యువతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని లక్షలాది రూపాయలు దండుకుంటూ.. మోసాలకు పాల్పడుతున్న నిందితురాలిని జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
వివరాల్లోకి వెళితే కూకట్ పల్లి వెంకటరమణ కాలనీ గోకుల్ ప్లాట్స్ లో నివసించే సంజన (50) గత కొంత కాలంగా అమాయక యువతుల బలహీనతలను ఆసరాగా చేసుకుంటూ.. వారిని కష్టాల నుంచి దూరం చేసేందుకు తాను దేవుడితో మాట్లాడతానని, ప్రార్థనలు చేస్తానని చెప్పేది.
ఇటీవల ఓ పెళ్లి సంబంధం వచ్చి తప్పిపోయిన సందర్భంగా జూబ్లీహిల్స్ కు చెందిన యువతి ఆమె ట్రాప్ లో పడింది. ఆమె జీవితాన్ని గాడిలో పెడతానని అంటూ పలు దఫాలుగా ఆమె దగ్గర నుంచి రూ. 70 లక్షలు వసూలు చేసింది.
హైద్రాబాద్లో భారీ వర్షం: వరద నీటిలో చిక్కుకొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారు
ఆమె మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలి తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సంజన గుట్టురట్టయింది. అమాయకులను బుట్టలో వేసుకుంటూ తన అకౌంట్ లోకి డబ్బులు రాబట్టుకుంటుందని తేలింది.
దీంతో నిందితురాలిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 406, 420, 508 కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. తాజాగా నిందితురాలి పై ఓ బాధితురాలు హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయగా అక్కడ మరో కేసు నమోదైంది.