
కరోనా మహమ్మారి దేశంలో రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ క్రమంలో ఆస్పతులలో బెడ్స్ దొరకక.. ఆక్సీజన్ అందక.. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ మహిళ సరైన సమయంలో ఆక్సీజన్ అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. ఆరు ఆస్పత్రులు తిరిగినా.. ఆమెకు ఆక్సీజన్ దొరకకపోవడం గమనార్హం. ఈ సంఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సీతాఫల్మండి బ్రాహ్మణబస్తీకి చెందిన శేషాచార్యులు, పుష్పవల్లి దంపతులకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. మూడో కుమార్తె అనితకుమారి (48) భర్త వేణుగోపాల్తో కలసి బెంగళూర్లో నివసిస్తున్నారు. అనితకుమారి స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించగా నెగెటివ్ వచ్చింది.
ఈనెల 21న కారులో బెంగళూర్ నుంచి తల్లి గారింటికి వచ్చింది. 22 సాయంత్రం శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో అంబులెన్స్లో ఆస్పత్రికి బయల్దేరారు. కమల ఆస్పత్రి, యశోద, ఓమ్ని, గ్లోబల్, నక్షత్ర ఆస్పత్రులకు వెళ్లగా, ఆక్సిజన్ కొరత ఉందని, పడకలు ఖాళీ లేవని అడ్మిట్ చేసుకోలేదు. ఎల్బీనగర్ సమీపంలోని ఓజోన్ ఆస్పత్రిలో ఆక్సిజన్, బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే అనితకుమారి మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
ఇదిలా ఉండగా.. ఆమె సోదరి సరిగ్గా వారం రోజుల క్రితమే ప్రాణాలు కోల్పోయారట. ఆమె కూడా ఇదే విధంగా బ్రీతింగ్ సమస్యతో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.