హైదరాబాద్ రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ స్టార్ హోటల్ పబ్లో యువతిపై దాడి జరిగింది. యువతిపై దాడి చేసినవారిలో బడా బాబుల పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
హైదరాబాద్ రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ స్టార్ హోటల్ పబ్లో యువతిపై దాడి జరిగింది. కొందరు యువకులు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. యువతిపై దాడి చేసినవారిలో బడా బాబుల పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వివరాలు.. ఇటీవల బాధిత యువతి ఫ్రెండ్స్తో కలిసి ఐటీసీ కోహినూర్ సమీపంలోని రూఫ్ టాప్ పబ్ వచ్చింది. అయితే పబ్లో కొందరు యువకులు ఆమె వద్దకు వచ్చి ఫోన్ నెంబర్ అడిగారు. అయితే ఆమె ఫోన్ నెంబర్ ఇవ్వనని చెప్పడంతో.. అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమెను రేప్ చేస్తామని బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలిసింది.
అడ్డొచ్చిన యువతి ఫ్రెండ్స్పై కూడా వారు దాడి చేశారు. మద్యం సీసాలతో వారిని గాయపరిచినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిని అడ్డుకునేందుకు చూసిన పబ్ నిర్వాహకులపైన కూడా బెదిరింపులకు యువకులు పాల్పడ్డారు. రూఫ్ టాప్ పబ్లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కొన్ని తెలుగు న్యూస్ చానల్స్ రిపోర్ట్ చేశాయి.
ఇందుకు సంబంధించి బాధితురాలు రాయదుర్గం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పబ్ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక, బాధిత యువతి న్యూట్రిషనిస్ట్, డైటీషియన్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇక, ఇటీవల హైదరబాద్ పబ్ల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు హాట్ టాపిక్గా మారుతున్న సంగతి తెలిసిందే. పలు పబ్లు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ.. కస్టమర్లను ఆకర్షించేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన పబ్ యజమాన్యాల తీరు మారడం లేదు. పబ్లో వచ్చే యువత విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఇటీవల అమ్నేషియా పబ్కు వచ్చిన మైనర్ బాలికను కారులో తీసుకెళ్లిన దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.