భర్త దగ్గర నుంచి రూ.41లక్షలు కాజేసిన భార్య

First Published Jul 31, 2018, 3:30 PM IST
Highlights

తన భర్తకు తెలీకుండా ఇంట్లోని రూ.41లక్షలు కాజేసింది. ఎవరో వచ్చి డబ్బు పట్టుకుపోయారంటూ భర్తను నమ్మించింది. 

సంపాదించినదంతా రెండో భార్యకి దోచిపెడుతున్నాడనే అక్కసుతో ఓ మహిళ.. తన భర్తకు తెలీకుండా ఇంట్లోని రూ.41లక్షలు కాజేసింది. ఎవరో వచ్చి డబ్బు పట్టుకుపోయారంటూ భర్తను నమ్మించింది. బాధితుడి ఫిర్యాదుమేరకు రంగంంలోకి దిగిన పోలీసులు ఈ మిస్టరీని చేధించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...హైదరాబాద్ సరూర్ నగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నారాయణకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు సుధ. సంపాదించినదంతా తీసుకెళ్లి రెండో భార్యకి కట్టబెడుతున్నాడని సుధ బాధపడేది. కాగా.. ఇటీవల వెంకటేష్ యాదవ్ అనే వ్యక్తి సాయంతో నారాయణ ఇల్లు కొనుగోలుకు ప్రయత్నం చేస్తున్నాడు. 41 లక్షల రూపాయలను ఇంట్లో తెచ్చి పెట్టాడు. భర్త ఇంట్లోలేని సమయంలో మొదటి భార్య 41 లక్షల రూపాయలను కొట్టేసింది. 

వెంకటేష్ యాదవ్ పేరు చెప్పి ఇద్దరు వ్యక్తులు డబ్బులు తీసుకెళ్లారని భర్తకు  సుధ ఫోన్  చేసి చెప్పింది. డబ్బుల కోసం తాను ఎవర్ని పంపలేదని వెంకటేష్ యాదవ్ నారాయణకు చెప్పాడు. అసలు డబ్బులు తీసుకున్నది ఎవరో అర్థంకాక 
నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నారాయణ, అతడి  మొదటి భార్య సుధను విచారించారు. నారాయణ ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. నారాయణ ఇంటికి ఎవరూ రాలేదని తేలింది. ఇద్దరు వ్యక్తులు వచ్చి డబ్బులు తీసుకెళ్లారని సుధ పోలీసులతో మొండిగా వాదించింది. 

నారాయణ మొదటి భార్య సుధ తీరుపై పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో ప్రశ్నిస్తే తానే డబ్బులు చోరీ చేసినట్లు సుధ ఒప్పుకుంది. రెండో భార్యపై అసూయతోనే దొంగతనం చేసినట్లు పోలీసులకు చెప్పింది. నిందితురాలి నుంచి  41 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

click me!