తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు ప్రకటించిన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు లేకపోవడంపై విభిన్నమైన ప్రచారాలు సాగుతున్నాయి.
వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు ప్రకటించిన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాలో వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు లేకపోవడంపై విభిన్నమైన ప్రచారాలు సాగుతున్నాయి. ఆమె ఫ్యామిలీ ప్యాకేజీ కోరినందు వల్ల ఆమె టికెట్ పెండింగులో పడిందని అంటున్నారు.
భూపాలపల్లి టీఆర్ఎస్ అభ్యర్థిని తానే అంటూ కొండా దంపతుల కూతురు సుస్మితా పటేల్ హడావిడి చేశారు. భూపాలపల్లి నుంచి స్పీకర్ మధుసూదనా చారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తిరిగి ఆయనకే కేసిఆర్ టికెట్ ఖరారు చేశారు. దాంతో సుస్మితా పటేల్ కు ఆ సీటు దక్కే అవకాశం లేదని తేలిపోయింది.
కొండా దంపతులు తమకు వరంగల్ తూర్పు, భూపాలపల్లి సీట్లతో పాటు మరో సీటు కావాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తమ డిమాండ్ ను అంగీకరించకపోతే పార్టీ మారుతామనే సంకేతాలను కూడా పంపినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
ఆ ఫ్యామిలీ ప్యాకేజీ కారణంగానే సురేఖ పేరును కేసిఆర్ పెండింగులో పెట్టారని అంటున్నారు. ఒక్క టికెట్ మాత్రమే ఇస్తామని, అక్కడి నుంచి కొండా సురేఖ గానీ లేదంటే కూతురు సుస్మితా పటేల్ గానీ పోటీ చేయవచ్చునని కేసిఆర్ చెప్పినట్లు సమాచారం. కొండా దంపతులకు తన సమయం ఇవ్వడానికే వరంగల్ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించలేదని చెబుతున్నారు.
కొండా సురేఖ అభ్యర్థిత్వం ఖరారు పెండింగులో పడడంతో వరంగల్ తూర్పు నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నవారు రంగంలోకి దిగారు. మేయర్ నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ గుండు సుధారాణి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, గుడిమళ్ళ రవికుమార్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే, కొండా దంపతులు కాంగ్రెసు గూటికి చేరుకుంటారనే ప్రచారం కూడా సాగుతోంది. కొండా దంపతులు గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారని, అంతే కాకుండా టికెట్ల విషయంలో తమ డిమాండ్లను కేసిఆర్ పట్టించుకోవడం లేదని వారు పార్టీ మారడానికి సిద్ధమైనట్లు చెబుతున్నారు.
ఈ కథనాలు చదవండి
కొండా సురేఖ టిక్కెట్టుపై వీడని సస్పెన్స్, ఎందుకంటే?
చిట్టెక్క కోసం ప్లాన్: కేసీఆర్ కు కొండా దంపతుల సవాల్
కొండా సురేఖకు కడియం ఎదుటే అవమానం: పొమ్మనలేక పొగ?