లక్ష ఇళ్లు చూపించేవరకు తిరుగుతా: తలసాని, 3428 ఇళ్లే చూశామన్న భట్టి

Published : Sep 17, 2020, 02:29 PM IST
లక్ష ఇళ్లు చూపించేవరకు తిరుగుతా: తలసాని, 3428 ఇళ్లే చూశామన్న భట్టి

సారాంశం

సీఎల్పీనేత మల్లుభట్టి విక్రమార్క, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు గురువారం నాడు నగరంలోని 3428 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. రేపు కూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన కార్యక్రమం కొనసాగుతోందని నేతలు ప్రకటించారు.


హైదరాబాద్: సీఎల్పీనేత మల్లుభట్టి విక్రమార్క, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు గురువారం నాడు నగరంలోని 3428 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. రేపు కూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన కార్యక్రమం కొనసాగుతోందని నేతలు ప్రకటించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంపై సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క సవాల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు. అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా హైద్రాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను భట్టి విక్రమార్కు చూపిస్తానని మంత్రి చెప్పారు. 

దీంతో ఇవాళ ఉదయం భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి మంత్రి తలసాని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్లారు. నగరంలోని పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత మల్లుభట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడారు.

అందరం కలిసి నగరంలో పేదల కోసం  నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించినట్టుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. మిగిలిన ఇళ్లను రేపు చూపిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారన్నారు. 

జియాగూడ, కట్టెలమండి, ఇందిరాగాంధీ కాలనీ, బన్సీలాల్ పేట, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించినట్టుగా ఆయన చెప్పారు. ఇవాళ 3428 ఇళ్ల నిర్మాణాలను చూసినట్టుగా సీఎల్పీ నేత చెప్పారు. వీటిలో కొన్ని పాత ఇళ్ల స్థలంలో కొత్త ఇళ్లను నిర్మిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

ఇళ్ల నాణ్యతపై ఇంజనీరింగ్ నిపుణులు తనిఖీలు చేస్తున్నారని ఆయన భట్టి విక్రమార్క చెప్పారు. ఇంజనీరింగ్ నిపుణుల నివేదిక ప్రకారంగా తాను ఈ విషయమై మాట్లాడుతున్నానని చెప్పారు.రాజీవ్ గృహకల్ప, స్వగృహ ఇళ్ల నాణ్యత విషయంలో లబ్దిదారులు గురించి చెబితే బాగుంటుందన్నారు. ఈ విషయమై తాను రేపు స్పందిస్తానని చెప్పారు.

హైద్రాబాద్ పట్టణంలోని 60 ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నట్టుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఇవాళ కొన్ని ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణాలను చూసినట్టుగా చెప్పారు. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో డబుల్ ఇళ్లను రేపు తాము పరిశీలిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

గత ప్రభుత్వాల్లో లబ్దిదారులు కొంత డబ్బులు చెల్లించేవారు. కానీ తమ ప్రభుత్వం లబ్దిదారుల నుండి నయాపైసా తీసుకోకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

ఇవాళ తాము ఇవాళ పరిశీలించిన ఇళ్లలో పాత ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించినవి ఎక్కువగా ఉంటాయన్నారు మంత్రి.హైద్రాబాద్ లో లక్ష ఇళ్ల కోసం రూ. 10వేల  కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆయన చెప్పారు.

వీలైనంత త్వరగానే ఈ ఇళ్లను నిర్మించి పేదలకు అందిస్తామని మంత్రి తెలిపారు. ఎక్కడెక్కడ డిమాండ్ ఉంటే అక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.లక్ష ఇళ్లు చూపించేవరకు కూడ తాను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెంటే తిరుగుతానని ఆయన చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇరాన్‌లో యుద్ధం... హైద‌రాబాద్‌లో పూరీ, దోసెలు బంద్ చేస్తున్న హోట‌ళ్లు. అస‌లేంటీ లాజిక్
Kavitha Hunger Strike for Velugumatla Displaced Families in Hyd, Telangana | Asianet News Telugu