
హైదరాబాద్: జీహెచ్ఎంసీ సమావేశంలో బుధవారంనాడు గందరగోళం నెలకొంది. బీజేపీ కార్పోరేటర్ల తీరును నిరసిస్తూ వాటర్ బోర్డు అధికారులు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు సమావేశాన్ని బహిష్కరించారు.
బుధవారంనాడు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ పాలకవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని మంచినీరు, మురుగు నీరు, కుక్కకాటు వంటి సమస్యలను ప్రస్తావిస్తామని బీజేపీ కార్పోరేటర్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీ సమావేశం ప్రారంభమైన తర్వాత బీజేపీ కార్పోరేటర్లు ఈ విషయమై సమావేశంలో ప్రస్తావించారు.
అయితే సమావేశంలో విపక్ష కార్పోరేటర్లు వ్యవహరించిన తీరును నిరసిస్తూ వాటర్ బోర్డు అధికారులు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించి సమావేశం నుండి వెళ్లిపోయారు. బీజేపీ కార్పోరేటర్లు తమను ఉద్దేశించి అసభ్య పదజాలం ఉపయోగించారని అధికారులు ఆరోపించారు.
also read:జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం.. లైఫ్ జాకెట్లతో బీజేపీ కార్పొరేటర్ల వినూత్న నిరసన..
అదే సమయంలో బీజేపీ కార్పోరేటర్లు మేయర్ పోడియం ముందు నిలబడి ఆందోళనకు దిగారు. నగరంలో నెలకొన్న సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు. కార్పోరేటర్లు తమ సమస్యలను ప్రస్తావిస్తే అధికారులు సమాధానమిస్తారని మేయర్ చెప్పారు.
అయితే విపక్ష కార్పోరేటర్లు తమను దూషించడాన్ని నిరసిస్తూ వాటర్ బోర్డు డైరెక్టర్లు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు. జీహెచ్ఎంసీ సమావేశాన్ని అధికారులు బహిష్కరించడం బహుశా ఇదే ప్రథమం.దీంతో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు.